హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): గెజిట్ అమలు, ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన అంశాల్లో ఏపీ సర్కారు ప్రతిసారి తెలంగాణతో ముడిపెట్టడాన్ని రాష్ట్ర సర్కారు ఆక్షేపించింది. తెలంగాణ అప్పగిస్తేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని ఏపీ షరతులను విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోసారి ఇది పునరావృతమైతే జీఆర్ఎంబీ సమావేశాలకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవారం జీఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ రాష్ట్ర అంతర్రాష్ట్ర జల మండలి చీఫ్ ఇంజినీర్ మోహన్కుమార్ లేఖ రాశారు. కేంద్రం విడుదల చేసిన రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం 14 ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించాలని, సీడ్మనీ చెల్లించాలని.. ఏపీ, తెలంగాణకు జీఆర్ఎంబీ గతంలో లేఖ రాసింది. అయితే పెద్దవాగు ప్రాజెక్టు మినహా మరే ప్రాజెక్టును బోర్డుకు అప్పగించబోమని అప్పుడే తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది.
పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణకు కావాల్సిన అదనపు సిబ్బందిని, నిధులను రూ.1.5 కోట్లుగా అంచనా వేయటంతో పాటు వాటిని సమకూర్చేందుకు సిద్ధమని సుముఖత వ్యక్తం చేసింది. మేడిగడ్డ, దుమ్ముగూడెం, గీసుగొండ రెగ్యులేటరీలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు మాత్రం తెలంగాణ తన ప్రాజెక్టులను అప్పగిస్తేనే తమ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని మెలికపెట్టింది.
ఇదే విషయమై తెలంగాణకు బోర్డు లేఖ రాయగా, రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులను ఇవ్వడం, ఇవ్వకపోవడం ఏపీ ఇష్టానికి సంబంధించిన విషయమని, అందులో తెలంగాణ అప్పగిస్తేనే! అంటూ షరతులు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. మరోసారి తెలంగాణతో ముడిపెట్టొద్దని స్పష్టం చేసింది. ఇక, సీలేరు పవర్ ప్లాంట్ను ఏపీ ప్రాజెక్టుగా పరిగణించడంపైనా తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీలేరు పవర్ ప్లాంట్లో తెలంగాణకు వాటా ఉంటుందని, ఆ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీలేరు ప్లాంట్ ఇప్పటికీ ఉమ్మడి ప్రాజెక్టేనని తేల్చి చెప్పింది.