ములుగు, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఇందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో జాయింట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నిరంతరం యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులో పర్యటించారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పను, కొత్తగా నిర్మిస్తున్న సీఆర్పీఎఫ్ క్యాంప్ ను సందర్శించారు. డీజీపీ వెంట రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ టీ ప్రభాకర్రావు, ఐజీలు నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం(నూగూరు) సర్కిల్ కార్యాలయంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడంలో భద్రాద్రి జిల్లా పోలీసులు సఫలీకృతమయ్యారని ప్రశంసించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 20 మంది ఉంటే అందులో 11 మంది, మిగతా 130 మంది వరకు తెలుగువారు పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా జనజీవన స్రవంతిలో కలిసి సమాజాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జనస్రవంతిలో కలిసిన మావోయిస్టులను ప్రభుత్వం తరఫున ఆదుకొంటామని డీజీపీ హామీనిచ్చారు. సమావేశంలో ఎస్పీలు డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, సురేందర్రెడ్డి, శరత్చంద్రపవార్, వినీత్, ఓఎస్డీలు గౌస్ఆలం, టీ సాయి మనోహర్, ఏటూరునాగారం ఏఎస్పీలు అశోక్కుమార్, బిరుదరాజు రోహిత్రాజు, సుధీర్, అక్షాంశ్ యాదవ్ వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్సైలు తిరుపతి, అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.