విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఉన్న ఎల్బీనగర్ అన్ని హంగులను సమకూర్చుకుంటున్నది. నాడు ఎల్బీనగర్ పేరు చెప్పగానే ట్రాఫిక్ పద్మవ్యూహమే గుర్తొచ్చేది. నేడు అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, స్కై ఓవర్ల నిర్మాణాలతో ఎల్బీనగర్ బేఫికర్గా మారింది. సీఎం కేసీఆర్ హయాంలో రూ.3,718 కోట్లతో జరిగిన అభివృద్ధితో ఎల్బీనగర్ రూపురేఖలు మారిపోయాయి. లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా గ్రేటర్ మహానగరంలో తూర్పు ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
హైదరాబాద్లో సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమం ప్యాకేజీ 2లో భాగంగా నియోజకవర్గంలో రూ.658 కోట్ల అంచనా వ్యయంతో 8 ఫ్లై ఓవర్లు, 3 అండర్ పాస్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు 7 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చా యి. ఫ్లై ఓవర్, అండర్పాస్ల నిర్మాణాలతో ఇన్న ర్ రింగ్ రోడ్డులో శంషాబాద్ ఎయిర్పోర్టు, విజయవాడ జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రహదారుల్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి మార్గం సుగమమయ్యింది.
రూ.25 కోట్లతో శ్మశానవాటికలు..
నాగోలు ఫతుల్లగూడలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలకు సంబంధించి ఆరు ఎకరాల్లో రూ. 25 కోట్ల వ్యయంతో శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆటోనగర్లో అంతర్జాతీయ హంగులతో కూడిన బస్బే 24 బస్స్టాపులతో ఏసీ, నాన్ ఏసీ బస్షెల్టర్లతో సుమారు 25 వేల మంది ప్రయాణికులను చేరవేసేందుకు నిర్మాణం ప్రారంభం కానున్నది.
మూసీకి కొత్తందాలు..
మూసీ నది క్లీనింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వరదలతో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. నాగోలు బ్రిడ్జి ప్రాంతం నుంచి కొత్తపేట సత్యానగర్ వరకు రెండున్నర కిలోమీటర్లు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు.
ఎస్ఎన్డీసీ రూ.113 కోట్లు
నియోజకవర్గంలో రూ.113 కోట్లతో నాలా బాక్స్ డ్రెయిన్ పనులు ప్రారంభించారు. వీటిలో నాగోలు, బండ్లగూడలో పనులు పూర్తయ్యాయి. మన్సూరాబాద్, హయత్నగర్, ఇన్నర్ రింగ్రోడ్డులో పనులు సాగుతున్నాయి.
మంచినీటి కోసం రూ.126 కోట్లు..
నియోజకవర్గం వ్యాప్తంగా రూ.126 కోట్లు మంచినీటి సదుపాయానికి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.140 కోట్లు ఖర్చు చేశారు. 11 రిజర్వాయర్లతో 254 కిలో మీటర్లు మిషన్ భగీరథ పైప్లైన్ పనులు చేపట్టారు.దేశంలో ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే రూ.2 కోట్లతో యానిమల్ క్రిమిటోరియం ఏర్పాటు చేశారు.
రూ.24 కోట్లతో 12 స్పోర్ట్స్ కోర్టులు..
నియోజకవర్గంలో రూ.24 కోట్లతో 12 స్పోర్ట్స్ కోర్టులు, రూ.2 కోట్లతో పార్కులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో 4,000 వేల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధి చేకూర్చారు.
హై లెవల్ మార్కెట్..
బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన భవనాల పునరుద్ధరణ చేపట్టింది. నగరంలోని నారాయణగూడలో రూ.4 కోట్ల వ్యయంతో ప్రభుత్వం మల్టీలెవల్ మార్కెట్ను నిర్మించింది. మొత్తం ఐదు అంతస్తుల్లో భవనాన్ని ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభం వాయిదా పడింది. బండ్లపై కూరగాయలు విక్రయించే వారికి, చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనే వ్యాపారులకు ఎంతో ఉపయోగపడనున్నది.
-అంబర్పేట
హరితహారం మెరిసింది.. ఆకుపచ్చ తోరణంతో మురిసింది
హైదరాబాద్ హరితనగరిగా దేశంలో పేరు సంపాదించింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. సిటీ మొత్తం గ్రీనరీతో మెరిసిపోతున్నది. మిగతా నగరాలతో పోలిస్తే మన జీవవైవిధ్యం మెరుగైంది. శివారు ప్రాంతాలన్నీ (ఔటర్ రింగు రోడ్డు చుట్టూ) ఆకుపచ్చ తోరణంతో స్వాగతం పలుకుతున్నట్లే అనిపిస్తున్నది. విడుతల వారీగా చేపట్టిన హరితహారమే ఇందుకు కారణం. దృఢమైన సంకల్పంతో పనిచేస్తే అనుకున్న ఫలితాలను సాధించవచ్చని సీఎం కేసీఆర్ నిరూపించారు.
– పుల్లన్నగారి కన్నారెడ్డి, అల్వాల్