Telangana | ఒకప్పుడు తెలంగాణ అంటే.. కుప్పకూలిన బతుకులు.. కండ్లనిండా నిరాశ.. మనసు నిండా నిస్పృహ.. కనుచూపు మేరలో కానరాని భవిష్యత్తు.. వెలుగు మొలకల కోసం నిరంతరాన్వేషణ.. ఎండిన పొలాలు.. పాడుబడిన భవనాలు.. కుదేలైన వృత్తి బతుకులు.. కూలడానికి సిద్ధమైన వ్యవస్థలు.. ఇది తప్ప తెలంగాణకు మరో ముఖచిత్రం కనిపించలేదు.
హైదరాబాద్ అంటే ప్రైవేట్ వ్యక్తులు.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కట్టుకొన్న ప్రైవేట్ ఆస్తులను చూసి మురిసిపోవడమో.. లేక.. ఏ కుతుబ్షాహీలో, నిజాములో నిర్మించిన పాత భవనాలను చూసి సంతృప్తి పడటమో తప్ప అభివృద్ధి అన్న మాట లేనేలేదు.
హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ ఊళ్ల గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేని దుస్థితి. శిథిల భవనాల మాదిరే.. తెలంగాణ బతుకులు కూడా ఒకనాడు శిథిలమైనవే. వానలు రావు.. నీళ్లు ఉండవు.. కరెంటుకు దిక్కు లేదు.
వృత్తులు నాశనమై.. వలసలు పోయి కూలీలుగా మారిన జీవితాలు.. సంక్షేమం అన్న మాటకు అర్థమే తెలియని తెలంగాణ.. ఉమ్మడి రాష్ట్రంలో కడుపు నిండిన జీవితాలు ఒకవైపు.. మనుగడ కోసం పోరాటం మరోవైపు.. తెలంగాణ పేరెత్తితేనే కసురుకొనే పరిస్థితి.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఈ వాతావరణాన్ని మార్చడం కోసం.. మొగులు వైపు రైతు చూడకుండా ఉండటం కోసం.. కరెంటు కోసం అన్నదాత ఆరాటపడకుండా చేయడం కోసం.. నేతన్నల మగ్గం అలుపులేకుండా పని చేయడం కోసం.. కులాలను నిలబెట్టడం కోసం.. తెలంగాణ అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించడం కోసం.. తన జాతి పునర్నిర్మాణం కోసం తెలంగాణను సాధించి.. సాధించిన దాన్ని నిలబెట్టడం కోసం ఉద్యమ నిర్మాత చేసిన కృషి.. ఇవాళ తెలంగాణను హిమశృంగమంత ఎత్తున నిలిపింది.
రకరకాల పథకాలు.. వందల కొద్దీ కార్యక్రమాల ద్వారా శిథిల బతుకులు సిరుల జీవితాలయ్యాయి. ఒక్కొక్క పథకం ఒక్కో వర్గానికి కష్టాల నుంచి తెరిపినిచ్చింది. పల్లె కన్నీళ్లు తుడిచింది. చేనేత, మత్స్యకారులు, యాదవులు, కుర్మలు, నాయీ బ్రాహ్మణులు, గీత కార్మికులు, రజకులు, దళితులు, గిరిజనులు.. మహిళలు.. యువకులు.. ఒకరా.. ఇద్దరా!.. బతుకు భయమనే జడిలో కొట్టుకొనిపోతున్న అన్ని వర్గాల వారిని ఒక్కో పథకంతో పైకి లాగి.. ఒడ్డుకు చేర్చారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం నిలువెత్తు భవనాలై నిలిచాయి.
మరోవైపు సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి అన్ని రంగాల్లోనూ దూసుకొనిపోతున్నది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు.. ఒక యాదాద్రి నారసింహ దేవాలయం.. సచివాలయం.. కలెక్టరేట్లు.. రైతు వేదికలు.. కల్లాలు.. కళాశాలలు.. గురుకులాలు.. దవాఖానలు.. ఆత్మగౌరవ భవనాలు.. రహదారులు.. ఫ్లైఓవర్లు.. రింగు రోడ్లు.. ఒకటా.. రెండా.. అడుగడుగునా.. స్వరాష్ట్ర ఫలాలు తెలంగాణ నిలువెత్తు సంతకాల్లా నిలుచున్న సందర్భం.
నేడు కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పైకి లేస్తున్నాయి. సంక్షేమంలో సంబురం.. అభివృద్ధిలో అద్భుతం.. ఒకనాడు అద్దెభవనాలు, చీకటి గుహల్లా, భూత్ బంగ్లాల మాదిరి ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ ఒకేచోట.. కార్పొరేట్ తరహాలో.. అద్భుతమైన ఇన్ఫ్రాతో నిర్మాణమైన అపురూప భవనాలు.. వెలుగు దివిటీలై తెలంగాణ కీర్తిని దేశమంతటా చాటుతున్నాయి. ఈ బృహన్నిర్మాణాలే కదా.. మనకు నీళ్లిచ్చినది.. పరిపాలనను దగ్గర చేసింది.. ఈ బృహత్ పథకాలే కదా.. ప్రజల కన్నీళ్లు తుడిచింది.. రైతు లోగిళ్లలో సిరులు కురిపించింది.. ఈ తెలంగాణ కోసం కదా.. మనం ఇన్నాళ్లూ పరితపించింది..
నాంపల్లిలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో 29,459 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల్లో నిర్మిస్తున్న మీడియా అకాడమీ భవనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్లాస్టరింగ్, పుట్టీ పనులు, రిటెయినింగ్ వాల్స్, ఫ్లోరింగ్, ఆడిటోరియం, శానిటరీ తదితర పనులు పూర్తయ్యాయి. రంగులు, ఎలక్ట్రికల్ పనులు, సీలింగ్ తదితర పనులు జరుగుతున్నాయి. సెల్లార్, గ్రౌండ్ఫ్లోర్ను పార్కింగ్ కోసం కేటాయించగా, మొదటి అంతస్తులో శిక్షణా తరగతుల కోసం రెండు హాళ్లు, రెండో అంతస్తులో చైర్మన్, కార్యదర్శి చాంబర్లతోపాటు కార్యాలయం, మూడో అంతస్తులో ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, నాలుగో అంతస్తులో ఆడిటోరియం, వెయిటింగ్ రూం నిర్మించారు.
దళితుల సామాజిక జీవనానికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలు చేయడానికి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో దళిత్స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసింది. రూ. 25 కోట్ల నిధులతో 67 వేల చదరపు అడుగుల్లో, మొత్తంగా 6 అంతస్తుల్లో భవనాన్ని ఇప్పటికే నిర్మించింది. సెంటర్ ప్రవేశద్వారంపై దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని 27 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసింది.
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును దాదాపు రూ.100 కోట్ల నిధులతో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసింది. 21 మీటర్ల ఎతె్తైన బోలు మహాస్థూపం, 24 మీటర్ల వ్యాసార్థంతో పురాతన అమరావతి/శ్రీపర్వత స్థూపాలు ప్రత్యేకాకర్షణగా బుద్ధుని జీవితం వర్ణించే శిల్పాలతో తీర్చిదిద్దారు. మహా స్థూపం గోపురం కింద, ఎనిమిది దికులకు ఎనిమిది బుద్ధుని విగ్రహాలతో కూడిన భారీ ఇత్తడి పూత మండపం, 40కి పైగా జాతక శిల్పాలతోపాటు, దక్షిణాసియాతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 13 ప్రముఖ బౌద్ధస్థూపాల ప్రతిరూపాలను బుద్ధవనంలో ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ లుంబినీపార్కు వద్ద 3.29 ఎకరాల విస్తీర్ణంలో రూ.177.50 కోట్ల వ్యయంతో అమరవీరుల స్మారక భవనాన్ని దీపం ఆకారంలో నిర్మిస్తున్నారు. రెండు బేస్మెంట్లలో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాల పార్కింగ్ను ఏర్పాటు చేశారు. రెండు సెల్లార్లు, గ్రౌండ్, మూడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. భవనం పైన తెలంగాణతల్లి విగ్రహం, నిరంతరం వెలుగుతూ ఉండే ఈ-ఫ్లేమ్ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో తెలంగాణ ఉద్యమ ఘట్టాలను వివరించే ఫొటో గ్యాలరీ, మ్యూజియంతోపాటు 80 నుంచి 100 మందికి సరిపడే ఆడియో విజువల్ హాలు నిర్మించారు. రెండో అంతస్తులో కన్వెన్షన్హాలు, మూడో అంతస్తులో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. పైన ఫ్లేమ్ చుట్టూ వ్యూ పాయింట్ను నిర్మించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయ భవనం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ భవనం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. రూ.617 కోట్లతో, 7 అంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. రెడ్ సాండ్ స్టోన్, క్లాడింగ్ పనులు, మెయిన్ ఎంట్రెన్స్, పోర్టికో, మెట్ల మార్గంతో పాటు ఫ్లోరింగ్ పనులు, ఫాల్స్ సీలింగ్, రెయిలింగ్ ఫిక్సింగ్, మెయిన్ గ్రాండ్ ఎంట్రీ, ఫౌంటెన్, డోమ్స్, ఎలక్ట్రికల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్
శంకుస్థాపన: 2015, నవంబర్ 22
ప్రారంభం: ఆగస్టు 4, 2022
లక్ష్యం: ప్రజా రక్షణలో మూడో కన్ను వంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రంలో ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సహా పూర్తి ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి నుంచే పర్యవేక్షించడంతోపాటు రియల్టైంలోనే సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకునేవీలుంది. అన్ని ప్రభుత్వరంగ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో రక్షించడం, నష్టా న్ని తగ్గించడంతోపాటు నిరంతర పర్యవేక్షణతో నేరాలను నియంత్రించడంలో కీలకభూమిక పోషించనున్నది.
శంకుస్థాపన : 2016 మే 2
ప్రారంభం: 2019 జూన్ 21
ప్రయోజనం: సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయడం మొదలు నిర్మాణంలోనూ సీఎం కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్ర సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కీలకభూమిక పోషించనున్నది. 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు 18.46 లక్షల ఎకరాలను స్థిరీకరించడం లక్ష్యం. ఇప్పటికే స్థిరీకరణ లక్ష్యం నెరవేరుతుండటంతోపాటు, కొత్త ఆయకట్టు 6 లక్షల ఎకరాలకుపైగా నీరందుతున్నది. ప్రాజెక్టు ద్వారా 20 జిల్లాలకు లబ్ధి చేకూరనున్నది. హైదరాబాద్ తాగునీటికి భరోసా లభించడంతోపాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చనున్నది.
ప్రారంభం: డిసెంబర్ 25, 2021
రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆరు లేన్లతో షేక్పేట, ఫిలింనగర్ జంక్షన్, ఓయూకాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్పేట ఫె్లైఓవర్ ఇంటర్మీడియట్ రింగ్రోడ్ నిర్మాణం హైదరాబాద్లో రెండవ అతి పెద్ద ఫ్లై ఓవర్గా నిలవనున్నది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్తో హైటెక్సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్లేందుకు వాహనదారులకు ఎంతో ఉపశమనం లభించనున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 104 చెరువులను మినీట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 573 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు 50 చెరువులను సుందరీకరించింది. పార్క్లతో వీటిని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దింది. మిగతా చెరువులకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నాయి.