హైదరాబాద్ : ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు నిలయంగా తెలంగాణ భాసిల్లుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసన సభలో బడ్జెట్ ప్రసంగం చదివారు. ఈ సందర్భంగా పర్యటక రంగంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పర్యాటక స్థలాల ఎంపిక కోసం ప్రత్యేక అధ్యయనం నిర్వహించిందని, దీని ద్వారా 479 ద్వారా ప్రధాన పర్యాటక స్థలాలను గుర్తించిందని, వీటిలో ఆధ్యాత్మిక, చారిత్రక, విజ్ఞానాత్మక స్థలాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ స్థలాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, బుద్ధ జయంతి, ప్రపంచ పర్యాటక దినోత్సవం తదితర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో ఉండడం విశేషమని, ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటి అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని.. వీటి సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం మంచి వసతులను ఏర్పాటు చేయబోతున్నదని, ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించారన్నారు.