Telangana | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత పార్లమెంట్నే రక్షించలేని బీజేపీ వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలోభాగంగా శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… పార్లమెంట్పై అగంతకులు చేసిన దాడి చేస్తే, సభలో చర్చించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో చర్చిద్దామని అడిగితే ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారన్నారు. పార్లమెంట్పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఆలోచించాలని సూచించారు. దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా పార్లమెంటు సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిషరణలు.. స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంతృత్వ పోకడలతో మోదీ పాలన సాగుతుందన్నారు.
ఎన్నికలకు ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటన సృష్టించి దేశ ప్రజల్లో బావోద్వేగాన్ని కల్పించి మళ్లీ అధికారంలోకి రావాలనే యావే తప్ప, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాగ్యాంగాన్ని కాపాడలనే ఆలోచనే బీజేపీకి లేదని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో దేశభక్తులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… పార్లమెంట్పై దాడిని ప్రశ్నిస్తే ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మర్గమన్నారు. పార్లమెంట్పై దాడికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు దేశం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, విప్ ఆది శ్రీనివాస్, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్, ఆప్ కన్వీనర్ సుధాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అంజనీకుమార్ యాదవ్ తదితరులు మాట్లాడారు.