హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కొనసాగిన వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాయంత్రం నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా శాఖల ప్రగతి నివేదికలను విడుదల చేశారు. కార్యక్రమానికి మంత్రులు సత్యవతిరాథోడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల విశిష్టతలను వివరించారు. వేడుకల్లో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డితోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన, డప్పు కళాకారుల దరువు ఆహూతులను అలరించాయి. కొమ్ము నృత్యం, బంజారాల గిరిజన నృత్యం ఆకట్టుకున్నది. మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కార్పొరేషన్ల చైర్మన్లు కళాకారులతోపాటు కలిసి నృత్యాలు చేశారు. దివ్యాంగులు వీల్చైర్లపై కూర్చొని చేసిన డ్యాన్స్లు మైమరింపజేశాయి.
రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల, లింగమార్పిడి వ్యక్తుల, యానిమల్ హస్బెండరీ తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. శాఖలవారీగా చేపడుతున్న పథకాలు, నిరుపేదలకు కల్పిస్తున్న వసతులను ప్రదర్శించారు. దివ్యాంగులశాఖ పంపిణీ చేస్తున్న ఉపకరణాలను, లింగమార్పిడి వ్యక్తులు ఉత్పత్తి చేస్తున్న జూట్ బ్యాగులను స్టాల్స్లో ఏర్పాటుచేశారు. మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు రూపొందించిన వస్తువులు, అల్లికలు వంటివి స్టాల్స్లో ప్రదర్శించారు. శాఖలవారీగా అమలవుతున్న పథకాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను సైతం ప్రదర్శించారు. దళితబంధు లబ్ధిదారుల విజయగాథలను ప్రదర్శించగా, ఆకట్టుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులూ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, నల్లగొండ జిల్లా నిడమనూర్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మహబూబాబాద్లో ఎర్రబెల్లి దయాకర్రావు, నిర్మల్లో ఇంద్రకరణ్రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, బాల్కొండలో వేముల ప్రశాంత్రెడ్డి, సూర్యాపేటలో జగదీశ్రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నల్లగొండ జిల్లా నకిరేకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, వరంగల్లో మంత్రి సత్యవతిరాథోడ్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఎమ్మెల్సీ కవిత, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.