Praja Palana | మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? అభయ హస్తంలో ఆరు గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గ్యారంటీలకు ఎంపికయ్యారని మీకు రేపో.. ఎల్లుండో కాల్ రావచ్చు! మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పొచ్చు! రేషన్ కార్డు మంజూరయ్యిందని అనొచ్చు! 500కే గ్యాస్ కనెక్షన్ సాంక్షన్ అయ్యిందని కూడా చెప్పొచ్చు!! కానీ గుడ్డిగా నమ్మేయకండి! ప్రాసెస్ మొత్తం అయిపోయింది.. మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఒక్క ఓటీపీ చెబితే చాలు.. ఈ ఆరు గ్యారంటీలు అమలు అయిపోతాయని చెబితే నమ్మి మోసపోకండి.! ప్రజాపాలన అప్లికేషన్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణ ప్రజలను ప్రమాదంలో పడేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పడంతో చాలావరకు డేటా బయటకు లీకయ్యిందన్న వార్తలు నిన్నటి నుంచి వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే ప్రజా పాలన లబ్ధిదారులకు సైబర్ పోలీసులు కీలక హెచ్చరిక చేశారు.
ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దన్నారు. ఆరు గ్యారంటీలకు ఎంపికయ్యామని సంతోషంలో ఓటీపీ చెప్పి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని సూచించారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.