సుల్తాన్బజార్, మే 27: కోఠి ఈఎన్టీ దవాఖానలో 24 గంటలపాటు 60 మంది రోగులకు సర్జరీలు నిర్వహించేలా చర్యలు తీసుకొంటున్నామని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం దవాఖానను సందర్శించిన ఆయన, వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను కలిసి, వారికి అందుతున్న వైద్యసేవలు, భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకొన్నారు. రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలు భేష్ అని కొనియాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్లాక్ఫంగస్ రోగులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,500 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,150, జిల్లాల్లో 350 పడకలను అందుబాటులో ఉంచామని అన్నారు. దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ మందులు యాంపోటెరిసిన్-బీ కొరత ఉన్నా, మన వద్ద సరిపడా మందులు ఉన్నాయని వివరించారు. బ్లాక్ఫంగస్ బారినపడిన రోగులకు వెంటనే శస్త్రచికిత్స చేస్తున్నామని, రోజుకు కోఠి ఈఎన్టీ దవాఖానలో 20 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, వాటిని 60కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. శస్త్రచికిత్సలకు ప్రత్యేక టీంలను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 700 మంది బ్లాక్ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. సీఎస్ వెంట డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఓఎస్డీ గంగాధర్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రిజ్వీ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్, పీఆర్వో డాక్టర్ మనీశ్గుప్తా ఉన్నారు.
ఒక్కరోజే 20 శస్త్రచికిత్సలు
కోఠి ఈఎన్టీ దవాఖానలో గురువారం ఒక్కరోజే 20 శస్త్రచికిత్సలు నిర్వహించగా, 20 మంది రోగులు డిశ్చార్జి అయినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. గురువారం దవాఖానకు బ్లాక్ఫంగస్ ఔట్పేషెంట్లు 235 మంది రాగా, 21 మందిని చేర్చుకొన్నామని చెప్పారు. దవాఖానలో బ్లాక్ఫంగస్ ఔట్పేషెంట్ రోగుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. వారం కిందట 350కు పైగా ఉన్న ఓపీ సంఖ్య 230కు చేరుకున్నది.