Telangana | హైదరాబాద్ : ట్యాంక్ బండ్( Tankbund ) పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా( Ambedkar Statue ) పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ) శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) నిర్మిస్తున్న ఈ భారీ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి( Ambedkar Birthday ) రోజున ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డితో కలిసి సీఎస్ పనులను పరిశీలించారు. ఈ పనులన్నింటినీ ఏప్రిల్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో నిర్మిస్తున్న యాంపి థియేటర్ పనులను పరిశీలించారు. ఈ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన కంటే ముందు నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కూడా సీఎస్ పరిశీలించారు.