Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందని సీఎస్కు కలెక్టర్ ప్రియాంక వివరించారు. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలతో పాటు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు.
వరద క్రమేపీ తగ్గుముఖం పడుతుండటంతో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య, వైద్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికార యంత్రంగాన్ని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. వరదల కారణంగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి బ్లీచింగ్ చేయాలని సూచించారు. దోమల నియంత్రణకు మురుగునీటి నిల్వలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, రసాయనాలు చల్లాలని సూచించారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య క్యాంపులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని.. సురక్షిత మంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్కి కాల్ చేయాలని సూచించారు.