సాగు సంబురమైంది.. సంబురం అంబరాన్నంటుతున్నది.. అవును.. తెలంగాణ ఇప్పుడు అచ్చంగా అన్నపూర్ణ.. దేశానికంతటికీ బువ్వ గిన్నె.. దేశమంతా పంటల సాగు తగ్గిన వేళ.. తెలంగాణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సాగు విస్తీర్ణం పెరిగిపోతున్నది.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ వానకాలంలో ఇప్పటికే 135.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. మరో నెలపాటు సీజన్ కొనసాగనుండటంతో సాగు సరికొత్త శిఖరాలకు చేరనున్నది. వరిసాగులోనూ దేశానికి తెలంగాణ రాష్ట్రం భరోసా ఇస్తున్నది. దేశంలో ఈ సీజన్లో వరిసాగు భారీగా పడిపోగా.. తెలంగాణలో రికార్డులు తిరగరాస్తూ ఇప్పటికే 64.31 లక్షల ఎకరాల్లో సాగైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. రైతన్న చైతన్యం కలిసి తెలంగాణను భారత్కు భాగ్య రేఖగా మార్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఉత్సవం జరుగుతున్నది. పుడమి తల్లికి పచ్చని పంటల హారతి పడుతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వానకాలం సాగు విస్తీర్ణం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ సీజన్లో బుధవారం వరకు రికార్డు స్థాయిలో 135.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వానకాలం సాగులో ఇదే అత్యధికం. ఉమ్మడి ఏపీలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయరంగం నత్త నడకన సాగింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ఎజెండాగా సరికొత్త పథకాలు ప్రవేశపెట్టడంతో సాగు పండగయ్యింది. తొలిసారిగా 2020-21 వానకాలంలో పంటల సాగు విస్తీర్ణం 135.63 లక్షల ఎకరాలకు చేరుకొన్నది. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నెలాఖరు వరకు ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. స్వరాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో 2015-16లో వానకాలం సాగు విస్తీర్ణం 85.41 లక్షల ఎకరాలు మాత్రమే. కేవలం ఎనిమిదేండ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 48 లక్షల ఎకరాలు పెరగడం గమనార్హం. దేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ వానకాలంలో అత్యధికంగా వరి రికార్డు స్థాయిలో 64.31 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. పత్తి 49.98 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6.20 లక్షల ఎకరాలు, కంది 5.61 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం నమోదు కావడంతో సీఎం కేసీఆర్ కృషి, రైతన్న కష్టం ఫలించినట్టయ్యింది. సీఎం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలే రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఈ స్థాయికి చేర్చాయని రైతు సంఘాల నేతలు కొనియాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వ్యవసాయరంగ అభివృద్ధినే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొన్నారు. కనీవినీ ఎరగని రీతిలో రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. సాగునీటి గోసను తీర్చేలా ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేవలం మూడేండ్లలో పూర్తిచేసి గోదావరి జలాలను బీడు భూముల్లో పారించారు. దీనికి తోడు రైతుబంధు, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో రైతులకు మరింత దన్నుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులో అండగా ఉండటంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకొన్నారు. బీడు భూముల్లో పసిడి పంటలు పండించడం ప్రారంభించారు. దీంతో ఒకప్పుడు గుక్కెడు నీళ్లకు, బుక్కెడు బువ్వకు ఏడ్చిన తెలంగాణ రైతన్న ఇప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఎదిగారు.
రాష్ట్రంలో వరి సాగు రికార్డులు సృష్టిస్తున్నది. వానకాలంలో వరి సాగు చరిత్రలో తొలిసారిగా 64.31 లక్షల ఎకరాలకు చేరింది. ఇది ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధిక సాగు కావడం గమనార్హం. ఇంతకుముందు రాష్ట్రంలో అత్యధికంగా గత వానకాలం సీజన్లో 62.12 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్లో 2.20 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేశారు. ఇతర రాష్ర్టాల్లో ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గితే ఒక్క తెలంగాణలో మాత్రమే రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు కావడం ఆనందంగా ఉన్నది. ప్రభుత్వం తీసుకొన్న ప్రణాళికాబద్ధమైన చర్యలు, అమలు చేస్తున్న పథకాలే ఇందుకు దోహదం చేశాయి. ప్రభుత్వం కృషికి రైతుల కష్టం తోడై తెలంగాణ వ్యవసాయరంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇదే ఉత్సాహంతో రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు చర్యలు తీసుకొంటాం.
-రఘునందన్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి