TS Minister Koppula | జగిత్యాల జిల్లా: తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేండ్లలో సంక్షేమం, అభివృద్దిలో నెంబర్ వన్గా ఎదిగిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొమ్మిదేండ్ల తర్వాత సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం శనివారం జిల్లా కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ముఖ్య అతిధిగా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ క్యాలెండర్ మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ రెండో తేదీన పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమై.. జూన్ 22న అమర వీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగుస్తుందన్నారు.
జూన్ రెండో తేదీ నుంచి 20 రోజులు ఊరూరా పండుగ వాతావరణంతో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలన్నారు. తెలంగాణ మాదిరే జగిత్యాల జిల్లా ఏర్పాటు కావాలన్న ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నూతన మండలాలు, గ్రామ పంచాయతీలతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన జగిత్యాల జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాభివృద్ది కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును, నాడు-నేడు ఫొటోల ప్రదర్శనతో వివరించాలని మంత్రి కొప్పుల అన్నారు. జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాల, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణకు దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరంద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.