హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): పాలనాసంసరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నూతన మండలాలు ఏర్పాటుచేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. నూతన మండలాల పరిధిలోని గ్రామాలతో ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజలు అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలపడానికి 15 రోజుల సమయం ఇచ్చారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజలు అభ్యంతరాలను తెలుపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రజలకు తగ్గిన ప్రయాణ భారం
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కొన్ని జిల్లాల్లో 200పైగా కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. మండల కేంద్రాలకు వెళ్లాలన్నా కనీసం 20-30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఈ కష్టాలన్నీ తొలిగిపోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేశారు. దీంతో గతంలో 10 జిల్లాలు ఉండగా, 33కు చేరాయి. 37 రెవెన్యూ డివిజన్లు 74కు, మండలాలు 464 నుంచి 607కు పెరిగాయి.
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు
పాలనా సంస్కరణల్లో భాగంగా, ప్రజల ఆకాంక్షల మేరకు జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో ఐదు నూతన మండలాలను ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. నూతన మండలాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం స్థానికంగా సంబురాలు జరుపుకొన్నారు. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.