పాపన్నపేట, మే 18: కుటుంబ కలహాలతో బావిలోకి దూకి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడే క్రమంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దారబోయిన నగేశ్ (35), స్వరూప (32) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వ్యవసాయంతోపాటు ఇటీవల గ్రామ శివారులో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద పశువుల కాపరులుగా చేరారు.
కొంతకాలంగా నగేశ్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఇద్దరు కలిసి పని నిమిత్తం ఫాంహౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ మళ్లీ కుటుంబ విషయంలో గొడవ జరిగింది. ఆవేశంలో స్వరూప అక్కడే ఉన్న బావిలో దూకింది. భార్యను కాపాడే ప్రయత్నంలో నగేశ్ తన దుస్తులు, ఫోన్ ఒడ్డున పెట్టి బావిలోకి దిగాడు. భార్యను కాపాడే క్రమంలో ఊపిరి ఆడక ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.