హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ దన్నుగా నిలవటం గర్వకారణంగా ఉన్నదని తెలిపారు. ‘దేశ జనాభాలో 2.5% ఉన్న మన రాష్ట్రం దేశ జీడీపీకి 5% సమకూరుస్తున్నది. అలాంటప్పుడు మనం ఇప్పటికీ బలమైన డబుల్ ఇంజిన్ కాదా? తెలంగాణ యావత్ భారత జాతికి గర్వకారణమైన కంట్రిబ్యూటర్’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్చేశారు.
విజయవంతమైన తెలంగాణ హ్యాష్ట్యాగ్ను తన ట్వీట్కు జతచేశారు. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు ‘భూ విస్తీర్ణంలో 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించడంలో నాలుగో స్థానంలో నిలవటం గర్వకారణం. తెలంగాణ రాకముందు రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అంటే డబుల్ అయ్యిందని.. నిజమైన డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే ఇదేనంటూ ట్వీట్లు చేశారు.
ఎంపీలకు అభినందనలు: మంత్రి కేటీఆర్
భారతదేశంలోని సామాన్యుల అతి ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించి పార్లమెంట్లో నిరసనలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు నా అభినందనలు అని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వం జీఎస్టీ పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.