హన్వాడ/కామారెడ్డి/ఎల్లారెడ్డి/నందిపేట్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల శిశువు మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.
మహబూబ్నగర్-చించోలి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కుమ్మెర ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా.. బాధ్యులను పూర్తిస్థాయిలో అరెస్టు చేయలేదని మండిపడ్డారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రజకులు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిలో కొవ్వొత్తులతో ర్యాలీ, నిజామాబాద్ జిల్లా నందిపేటలో రాస్తారోకో నిర్వహించారు.