Jalayagnam | హైదరాబాద్, ఫిబ్రవరి17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని కాగ్ అనాడు తూర్పరబట్టింది. అది పూర్తిగా ధనయజ్ఞనమేనని తేల్చిపారేసింది. కానీ ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అదే జలయజ్ఞం ప్రాజెక్టులను, పనులను కీర్తిస్తుండటం కొసమెరుపు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.83 లక్షల కోట్లతో జలయజ్ఞం కింద దాదాపు 74 ప్రాజెక్టుల పనులను చేపట్టింది.
ఆయా పనుల్లో వేలాది కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఆనాడే నిర్ధారించింది. తన నివేదికలో వివరాలతో సహా బయటపెట్టింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో దాదాపు 75 శాతం నిధులను కేవలం మట్టి పనులకే వినియోగించారని తేల్చింది. నిర్ణీతకాలంలో పనులను పూర్తిచేయకపోవడం వల్ల ఏకంగా రూ.52 వేల కోట్ల అదనపు భారం పడిందని కాగ్ తన నివేదికలో తేల్చిచెప్పింది. మొత్తంగా ప్రాజెక్టుల్లో కేటాయించిన రూ.1.83 లక్షల కోట్లలో రూ.1.47 లక్షల కోట్లను కేవలం 8 సంస్థలకే కేటాయించిందని కాగ్ వెల్లడించింది.
ప్రాజెక్టుల నిర్మాణం పేరిట దోపిడీ
ప్రాజెక్టుల డిజైన్లు సిద్ధంగా కాకపోయినా, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, భూమి, నిధులు లభ్యత లేకపోపోయినా ప్రాజెక్టుల నిర్మాణం పేరిట దోపిడీకి తెరలేపారని తప్పుబట్టింది. దోపిడీ కోసం ఈపీసీ అనే కాంట్రాక్టు విధానాన్ని సృష్టించారని దుయ్యబట్టింది. కొన్ని ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున ధనలాభం చేకూర్చేందుకు అంచనా వ్యయాలను భారీగా పెంచేశారని, అలా రూ.3129.51 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిందని లెక్కలతో సహా బయటపెట్టింది.
కాంట్రాక్టర్లు తక్కువ, పనులు ఎక్కువ కావడంతో ఒక్కో కాంట్రాక్టర్కు మూడుకంటే ఎక్కువ పనులు అప్పగించారని, నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్లను కూడా ఆమోదించారని, వాటి విలువే రూ.7,856.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. చివరకు కాంట్రాక్టర్లు భరించాల్సిన ఖర్చును కూడా నీటిపారుదల శాఖే భరించిందని, ఎల్లంపల్లి, తోటపల్లి, నెట్టెంపాడు, దేవాదుల తదితర ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతోపాటు ట్రాన్స్కో, జాతీయ రహదారి సంస్థ, ఆర్అండ్బీ తదితర సంస్థలకూ కలిపి రూ.439.78 కోట్లు అదనపు చెల్లింపులు చేశారని, ఆ నగదును కూడా రికవరీ చేయాలని కాగ్ ఆనాడే స్పష్టం చేసింది.
52,116 కోట్ల అదనపు భారం
మొత్తంగా 74 ప్రాజెక్టులను పరిశీలించి, శాస్త్రీయంగా టెండర్లు పిలిచి లోపరహితంగా ఒప్పందాలు కుదర్చుకుని సకాలంలో పనులు చేసి ఉంటే కేవలం రూ.91,574 కోట్ల వ్యయంతో పూర్తయ్యేవని తేల్చింది. తీవ్రమైన జాప్యం వల్ల ఆ ఖర్చు ఏకంగా 1,43,690 కోట్లకు పెరిగిందని, దాదాపు 52,116 కోట్ల అదనపు భారం అని, అది వాస్తవ వ్యయంపై 56.91 శాతం అదనమని పేర్కొన్నది. సర్కారు అడ్డగోలు నిర్ణయాలే దీనికి కారణమని కాగ్ నివేదికలో పేర్కంది. ఒప్పందం విలువలో దాదాపు 75 శాతం వరకు అప్రధాన పనులకే ఖర్చయిపోయిందని నిగ్గుతేల్చింది.
నాడు తప్పులతడక అన్న వైఎస్.. నేడు మెచ్చుకున్న కాంగ్రెస్
జలయజ్ఞంపై కాగ్ విడుదల చేసిన నివేదికను అప్పటి కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ నివేదికకు ఎలాంటి అర్థం లేదని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అప్పటి మంత్రులు కూడా నివేదికను తప్పులతడకగా అభివర్ణించారు. నేడు అదే కాంగ్రెస్ సర్కార్ అదే కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన నివేదికను మాత్రం తప్పుపడుతున్నది. ఆ నివేదికను సాకుగా చూపి గత బీఆర్ఎస్ సర్కారును బద్నాం చేసేందుకు పాలకులు యత్నిస్తున్నారు. అదే కాగ్ తప్పుబట్టిన నాటి జలయజ్ఞం ప్రాజెక్టులను, పనులను ఇప్పటి కాంగ్రెస్ నేతలు సమర్థిస్తుండడం గమనార్హం.