హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): ‘గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండో ఏడాది దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100 శాతం పూర్తి చేసింది. మేము ఇచ్చిన టార్గెట్ను అన్ని రాష్ర్టాల కన్నా ముందుగా పూర్తి చేసింది’ అని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కొనియాడింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్ సేథి గురువారం అన్ని రాష్ర్టాలకు లేఖ రాశారు. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆయా రాష్ర్టాల్లోని కనీసం 25 శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో పొందుపర్చాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తిచేసింది. 72 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో, 60 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 59 శాతంతో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచాయి. 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్లోనూ తెలంగాణ నంబర్వన్గా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రశంసలపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులను అభినందించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు మన పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాయని చెప్పారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కూడా పంచాయతీరాజ్ శాఖకు అభినందనలు తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, నిధులను సద్వినియోగం చేసుకొంటూ, ఆన్లైన్ ఆడిటింగ్లో నంబర్ వన్గా నిలిచిన మన పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.