యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయ శాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, వైటీడీఏ అధికారులు వసంత నాయక్, వేంకటేశ్వర్ రెడ్డి, గణపతి రెడ్డి, శంకరయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.