RRR | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్ పథకంలో భాగంగా చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు గత గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు హామీ లభించింది. మరోవైపు, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం 85 శాతం భూసేకరణ పూర్తికావడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే మూడేండ్లలో ఆర్ఆర్ఆర్ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్కు ప్రణాళిక రూపొందించిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని భారత్ మాల పరియోజన ప్రాజెక్టు కింద కేంద్రం చేపడుతుండగా, తాజాగా దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. మొత్తం 340 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లుగా రీజనల్ రింగ్రోడ్డును సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్గల్, శంకరపల్లి తదితర పట్టణాలగుండా నిర్మించనున్నారు. ఉత్తర భాగం కింద రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 158.645 కిలోమీటర్లమేర రోడ్డు నిర్మించాలని నిశ్చయించారు. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ తదితర పట్టణాలమీదుగా వెళ్తుంది. దక్షిణ భాగం కింద రూ.6,480 కోట్లతో 182 కిలోమీటర్లమేర రోడ్డును నిర్మించనున్నారు. ఇది చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి తదితర పట్టణాలగుండా వెళ్తుంది.
భారత్ మాల పరియోజన ఫేజ్-1లో భాగంగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 158.645 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తుండగా, దీనికి ఇప్పటికే 85శాతం వరకు భూసేకరణ పూర్తయింది. మొత్తం 1935.35 హెక్టార్లకుగాను ఇప్పటివరకు 1500 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. దీంతో వచ్చే మూడు నెలల్లోగా మిగిలిన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు సుమారు రూ. 5,170 కోట్లకుపైగా ఖర్చవుతుండగా, ఇందులో రూ. 2,585 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇదికాకుండా యుటిలిటీస్ షిఫ్టింగ్ కోసం రూ. 363 కోట్లు ఖర్చవుతుండగా, ఈ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చింది.