నిర్ణయానికి ఏండ్లు.. దానికి అమలుకు దశాబ్దాలు పట్టే కాలం కాదిది! ముంచుకొచ్చిన సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించడం స్వభావంగా మార్చుకున్న సర్కారిది! తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో విద్యుత్తు సమస్యను అధిగమించిన తీరైనా.. వలస పాలన దోపిడీలో వట్టిపోయిన తెలంగాణ మట్టిని బంగారంగా మార్చిన సాగునీటి దేవాలయాల నిర్మాణమైనా! ఇప్పుడూ అదే తీరు.. అదే వేగం! వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకొన్న ప్రభుత్వం.. నెల వ్యవధిలోనే దాన్ని ఆచరణలో పెట్టి.. తన పాలనలో వేగాన్ని చాటుకున్నది.
మే 9: వరంగల్ సెంట్రల్జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం ఆదేశం
మే 21: వరంగల్ జైలును సందర్శించిన కేసీఆర్.. జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ జైలుగా మార్చుతామని ప్రకటన.
మే 30: జైలు స్థలాన్ని వైద్యశాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని క్యాబినెట్లో నిర్ణయం. జైళ్ల శాఖ నుంచి వైద్యశాఖకు స్థలం అప్పగింత
మే 31: జైల్లోని ఖైదీలను ఇతర జైళ్లలో సర్దుబాటు చేసేందుకు హోంశాఖ అధికారుల కార్యాచరణ.
జూన్ 1: ఇతర జైళ్లకు ఖైదీల తరలింపు మొదలు
జూన్ 11: తరలింపు పూర్తి.. పనులు ఆర్అండ్బీకి
జూన్ 12: కొత్త దవాఖాన నిర్మాణానికి వీలుగా కేంద్ర కారాగారం కూల్చివేత.
వరంగల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ తర్వాత అంతటి ప్రఖ్యాతిగాంచిన కీలక నగరం.. ఇప్పుడు ఆరోగ్యరంగంలోనూ తనదైన ముద్ర వేయబోతున్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సంకల్పం అంత్యంత కీలకంగా మారింది. వరంగల్లో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చిన వెంటనే వరుస నిర్ణయాలు తీసుకున్న సీఎం.. మే 9న జరిగిన సమావేశంలో వరంగల్ జైలును అక్కడి నుంచి తరలించి, అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తర్వాత.. సరిగ్గా నెల వ్యవధిలోనే జైల్లో ఖైదీల తరలింపు మొదలు, జైలు ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుని, అక్కడి కట్టడాల కూల్చివేత వరకూ పనులు పూర్తిచేయించారు. ఈ నెల 20న వరంగల్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్.. అదే రోజు సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. 20 అంతస్థులతో నిర్మించే కొత్త భవనంలో అత్యాధునిక వైద్యసదుపాయాలు కల్పించనున్నారు. ఇక్క డే మెడికల్ కాలేజీని సైతం ఏర్పాటుచేయబోతున్నారు.
ప్రజల అవసరాలను గుర్తించడంలో, వారికి అసరాగా నిలువడంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. పట్టుదలతో సాగునీటి రంగంలో కొత్త చరిత్రను నమోదు చేసిన సీఎం కేసీఆర్.. పేదలకు వైద్య సేవలు అందించే విషయంలోనూ మరోసారి ఇలాగే చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్లో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మించాలన్న ప్రతిపాదన నెల రోజుల వ్యవధిలోనే పట్టాలెక్కింది. కొత్త దవాఖాన నిర్మాణానికి వీలుగా హోంశాఖ ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైదీలను తరలించేందుకు మే 31న హోంశాఖ ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 1న ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలై, 11 కల్లా పూర్తయ్యింది.
వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య విశ్వ విద్యాలయాలన్ని వరంగల్లోనే ఏర్పాటుచేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఇటీవలే 250 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించి ప్రారంభించారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో తూర్పు, ఈశాన్య తెలంగాణలోని 12 జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. జైలు ఆవరణలో 73 ఎకరాల భూమి ఉన్నది. దీంట్లోని 5 ఎకరాలను కాళోజీ హెల్త్ వర్సిటీకి కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించారు. మిగిలిన స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కానున్నది.
జైలు స్థలంలో కొత్త భవనం నిర్మాణానికి రోడ్లు, భవనాలశాఖ పనులు మొదలుపెట్టింది. పాత భవనాలను కూల్చివేతను ఒక్క రోజులో పూర్తి చేసింది. కొత్త దవాఖాన భవనం 20 అంతస్థులతో ఏడాదిలో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నిర్మాణం పూర్తయితే వరంగల్ నగరంలోనే పెద్ద భవనం ఇదే కానున్నది.