CM Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం మాస్టర్ప్లాన్తో విజన్ డాక్యుమెంట్-2050ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న ప్రాంతాన్ని ఓ యూనిట్గా, ఓఆర్ఆర్-రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) మధ్య ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్గా తీసుకొని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాం తాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతోపాటు ఆ చుట్టుపక్కల కొత్తగా విస్తరిస్తున్న మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతమివ్వాలని సూచించారు. సచివాలయంలో బుధవారం ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హెచ్ఎండీఏలో కీలక విభాగాలైన పట్టణ ప్రణాళిక (ప్లానింగ్), ఇంజినీరింగ్, ఓఆర్ఆర్, ఉమ్టా, లేక్ ప్రొటెక్షన్, ల్యాండ్ పూలింగ్ స్కీం, ఎస్టేట్ విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ పూలింగ్ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్తోపాటు అక్కడి స్థలాల అభివృద్ధి కోసం అవసరమైతే జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో 8,371 ఎకరాల ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయని, వాటిలో 2,031 పార్సిళ్లు కోర్టు కేసుల్లో మగ్గుతున్నాయని తెలిపారు. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు డిజిటల్, జీపీఎస్ విధానాలతో మ్యాపింగ్ చేయాలని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న స్థలాలతో ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టాలని, వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలని అన్నారు. ల్యాండ్ పార్సిల్స్, చెరువులు, కుంటలు అక్రమణలకు గురి కాకుండా చూసేందుకు ప్రత్యేకంగా డీఐజీ స్థాయిలో ఓ ఐపీఎస్ అధికారిని నియమించడంతోపాటు ఎస్పీ ర్యాంకు ఉన్న ఇద్దరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.
హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఆ స్థలాలను ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు అప్పగించాలని సూచించారు. ఆ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కనీసం 25% అడ్మిషన్లు దక్కేలా చూడాలని స్పష్టం చేశారు. హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలను అందమైన, ఆహ్లాదకరమైన జోన్లుగా తీర్చిదిద్దాలన్నారు. ఆ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి దుబాయ్ తరహాలో స్కైవాక్ వే, ఫుడ్ స్టాళ్లు, పిల్లల పార్కులు, అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ను అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలి తదితరులు పాల్గొన్నారు.
ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆ బాధ్యతలను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీ గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టారని ఆయన ఆరోపిస్తూ.. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై ఏటా రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు వివరించారు. దీంతో 30 ఏండ్లలో ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని సీఎం ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానం వల్ల రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక అందిన తర్వాత క్యాబినెట్లో చర్చించి సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తామని సీఎం తెలిపారు.