CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్నుమా లేదా ఎల్బీనగర్ నుంచి శంషాబాద్కు మెట్రో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్కు మెట్రోరైల్ మార్గాన్ని మార్చాలని నిర్ణయించామని తెలిపారు. ఫలక్నుమా మీదుగా శంషాబాద్కు వెళ్తే దగ్గరి దారి అవుతుందని, నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు జరిగిన తీరు సహా అన్ని విషయాలపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయాల్సి ఉన్నదని, అందులో సమగ్ర సమాచారాన్ని అందజేస్తామని చెప్పారు. ధరణిపై అధికారులతో సమీక్ష నిర్వహించి 35 మాడ్యూల్స్పై సమగ్రంగా చర్చించామని అన్నారు. వీటిపై అధికారుల వద్ద సరైన సమాచారం లేదని, సమస్త వివరాలతో రావాలని ఆదేశించినట్టు వెల్లడించారు. అధికారులు పూర్తి సమాచారంతో వచ్చిన తర్వాత సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా జ్యోతిబాపూలే ప్రజాభవన్ సముదాయంలోని క్యాంపు కార్యాలయాన్నే వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు రేవంత్రెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఉపయోగించిన నివాసాన్ని ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించగా అక్కడ ఉన్న జనహిత భవనంలో ప్రజాదర్భార్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు భవనాల మధ్య సీఎం క్యాంపు కార్యాలయం ఉన్నది. ఇదే భవనాన్ని తాను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసాన్నే అధికారిక నివాసంగా ఉపయోగిస్తానని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో ఖాళీగా ఉన్న ఒకటిన్నర ఎకరాల స్థలంలో త్వరలోనే ఒక భవనాన్ని నిర్మించి సీఎం అధికారిక నివాసంగా ఉపయోగిస్తామని పేర్కొన్నారు.
ప్రజాభవన్ సముదాయంలోని గెస్ట్హౌజ్ను ఎవరైనా మంత్రికి కేటాయిస్తామని లేదంటే స్టేట్ గెస్ట్ హౌజ్గా ఉపయోగిస్తామని చెప్పారు. ఈ భవనం పక్కనే ఉన్న పాత క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన కాన్వాయ్లోని వాహనాలకు నలుపురంగు వేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కొత్త వాహనాలు కొనడానికి తాను వ్యతిరేకినని పేర్కొన్నారు. కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని చెప్పానని, భద్రత గురించి తనకేమీ భయంలేదని అన్నారు. టీ వర్క్స్, టీ హబ్లలోని కొంతమంది అధికారులు ఇంకా రాజీనామా చేయకపోతే చేయించామని చెప్పారు.