CM Revant Reddy | రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావల్సిన గ్రాంటుపై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల గ్రాంటును ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలిపారు.
నాలుగేళ్లకు కలిపి పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకు అయిన రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపిందని, కేంద్ర హోం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించలేదని…ఆ రూ.408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఈ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులన్నీ 2014-15లో కేవలం ఆంధ్రప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని నిర్మలా సీతారామన్కు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పునర్విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.