Revant Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండి పడ్డారు. 60 ఏండ్ల క్రితం కొడంగల్ నుంచి ఎన్నికైన అచ్యుతారెడ్డి రాష్ట్ర మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి చేపట్టలేదన్నారు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సీఎం అయ్యేందుకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారన్నారు. వంద రోజుల్లోనే కొడంగల్కు మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పారు. అటువంటి తనపై కుట్ర జరుగుతున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘రూ. వందల కోట్లు ఖర్చు చేసి తండాలకు రోడ్లు వేశా. రూ.4,000 కోట్లతో నారాయణ్ పేట్ -కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చాం. కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రేవంత్ రెడ్డిని కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు.. రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి. కరువు ప్రాంతానికి నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చినందుకా..? కాలేజీలు తెచ్చినందుకా..? సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకా? బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న డీకే అరుణ.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేలేదు. కొడంగల్ ని డెవలప్ మెంట్ చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? లేదంటే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా..? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కొడంగల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిందా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రేవంత్ రెడ్డిని ఎందుకు పడగొట్టాలి..? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి..? ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు. మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్ర మండలానికి రాజవుతారా? అని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
‘రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడానికి వెనక గూడుపుఠాణీ చేస్తున్నారు. మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడం కాదు. కొడంగల్ డెవలప్ మెంట్ ను దెబ్బ తీయడం. కనుక కొడంగల్ మీద జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొట్టాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.