Prajavani | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రజాపరిపాలన పేరిట ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. వాటిని పరిష్కరించడంపై మాత్రం దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ను మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్గా మార్చింది. ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ పోర్టల్లో నమోదు చేసి, వాటి పరిష్కారానికి, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది.
కానీ, రెండునెలలుగా అర్జీలను తీసుకోవడమే తప్ప వాటిని పరిష్కరించిన దాఖలాల్లేవని తెలిసిపోతున్నది. అందుకు అసెంబ్లీలో ప్రభుత్వం పేర్కొన్న విషయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండు నెలల కాలంలో 43,054 దరఖాస్తులను స్వీకరిస్తే, వాటిలో ఇండ్ల కోసం 14,951, భూసమస్యల పరిష్కారం కోసం 8,927, పెన్షన్ల కోసం 3,267, ఉద్యోగ కల్పన కోసం 3,134 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వమే వెల్లడించింది. అందులో ఇప్పటివరకు ఎన్నింటినీ పరిష్కరించింది ఎక్కడా పేర్కొనలేదు. దీనిని బట్టే ప్రభుత్వం ఏ ఒక్క ప్రజావాణి దరఖాస్తును పరిష్కరించలేదని తెలిసిపోతుంది.