CM KCR | మొగులే అయితే బుగులేమున్నది.. వర్షాలు పడతాయి.. రైతన్న దున్నుకుంటడు.. సమస్యంతా కాలం కానప్పుడే! వానలు రానప్పుడే!! ఆకాశంలో నల్లమబ్బు కనిపించక, చినుకు చుక్క కిందికి జారక మొహం పైకెత్తి మోరసాచి.. దిక్కులు చూసే కరువు కాలం దాపురించినపుడే.. ప్రాజెక్టు అయినా, పాలకుడైనా ఆదుకోవాల్సింది.. సామాన్యుడు ఇవాల్టి గురించి ఆలోచిస్తడు.. రాజకీయ నాయకుడు రేపటి ఎన్నికల గురించి ఆలోచిస్తడు.. దార్శనికుడు రాబోయే తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తడు.. దాహమైనప్పుడు బావి తవ్వడం కాదు.. దరిదాపుల్లో నీళ్లే లేనప్పుడు వాటిని తేవడమెలా? అని ఆలోచించి, అమలుచేసేవాడే అసలైన పాలకుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది అదే.. రెండు జీవనదులైన గోదావరి, కృష్ణా మధ్యలో ఉన్నా, తెలంగాణకు అసలైన జీవనాడి ప్రాణహిత అని కేసీఆర్ 2016లోనే చెప్పారు. ఆయన మాట అక్షర సత్యమని రుజువవుతున్నది. గోదావరి-కృష్ణా నదులు నిరాశ పరుస్తున్నా, ప్రాణహిత తెలంగాణకు ప్రాణహితమై పారుతున్నది. కాళేశ్వరం రైతన్నకు ప్రాణేశ్వరంగా నిలుస్తున్నది. కాళేశ్వరంతో శ్రీరాంసాగర్, నిజాంసాగర్ను కూడా నింపవచ్చని 8 ఏండ్ల కిందట కేసీఆర్ చెప్పిన మాట ఈ రోజు సజల సత్యమై నిలుస్తున్నది.
మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి అవసరమైతే ఎస్సారెస్పీని కూడా నింపుతం. అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లి మల్లన్న సాగర్లో పడేస్తం. ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది. ఆ నీటిని ప్రాణహిత ఆయకట్టుతో పాటు నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు చేరవేస్తం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేం తక్కువ ఆలోచన చేయలేదు. పటిష్టంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకొంటున్నం.
– 2016 మార్చి 31న శాసనసభలో సీఎం కేసీఆర్
2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు అవుతుంది. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏటా రూ.10 వేల కోట్ల ఖర్చవుతుంది. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించలేమా? అయినా ఆ మొత్తం ఎవరి కోసం వెచ్చిస్తున్నం? ప్రతి ప్రభుత్వానికి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతా క్రమాలుంటాయి. అందులో తెలంగాణ ప్రభుత్వానికి రైతులకు సాగునీరు అందించడమనేది టాప్మోస్ట్ ప్రియారిటీ. వాళ్ల కోసం ఏటా రూ.10వేల కోట్లు వెచ్చించడమనేది మేం ఖర్చుగా భావించం.
– 2016 మే 31న ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల క్రితమే తెలంగాణ భవిష్యత్తును స్వప్నించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ పునర్నిర్మాణం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదాల్లో ఒకటైన నీళ్లకోసం అప్పటివరకు తలపండిన జల విధాన నిపుణులకు కూడా తట్టని ఆలోచనతో ప్రణాళికలు రచించారు. అందులో భాగమే కాళేశ్వరం ఎత్తిపోతల. ఎత్తిపోతలకు ఏటా విద్యుత్తుకే వేలకోట్లు ఖర్చు అవుతుందని కొందరు దీర్ఘాలు తీశారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడు ఎంతోమంది ఎన్నోరకాలుగా శంకించారు. గోదావరిని వదిలి ఉప నది అయిన ప్రాణహితపై ఆధారపడటం ఏమిటి? అన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ నేడు కాలమే సమాధానం చెప్పింది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అందరికీ తెలిసి వస్తున్నది. ఈ ప్రాజెక్టును గోదావరి నదిని వదిలి ప్రాణహితపై నుంచి సీఎం కేసీఆర్ ఎందుకు మొదలుపెట్టారో సర్వ జనులకు అవగతమవుతున్నది. ప్రస్తుత వర్షాకాల సీజనల్లో ఇప్పటివరకు మంచి వర్షాలే పడలేదు. గోదావరి నది ఒట్టిపోయి కనిపిస్తున్నది. కానీ, దాని ఉపనది అయిన ప్రాణహిత ఉత్తుంగ తరంగమై పరుగులు పెడుతున్నది. నిన్నటివరకు నదిలో 23 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అది నేడు 43 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. అంటే నాలుగు టీఎంసీలు.. ఏ పెద్ద నదిలోనూ చుక్కనీరు లేని కాలంలో.. ప్రాణహిత పరుగులు పెడుతున్నది. ఇప్పుడు అర్థమైందా కాళేశ్వరానికి నీటిని ఆ నది నుంచే తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఎందుకు గట్టిగా వాదించి, అమలుచేశారో? ఇది దార్శనికులు మాత్రమే చేయగల ఆలోచన.. సాధకులకు మాత్రమే సాధ్యమయ్యే ఆచరణ.
వేల టీఎంసీల గోదావరి జలాలు తెలంగాణ మీదుగా దిగువకు ప్రవహించినా, రెండు, మూడు లక్షల ఎకరాలకు కూడా నీటిని పారించలేని నిస్సహాయ స్థితిలో ప్రాజెక్టులు ఉండేవి. ఇకముందు తెలంగాణ అలాంటి గోస పడొద్దనే సీఎం కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు చేపట్టారు.
గోదావరి జలాలను ఒడిసిపట్టడం అంటే భగీరథ ప్రయత్నమే. ఈ ఏడాది నెల రోజులు గడిచినా ప్రధాన గోదావరిలో చుక్క నీరు లేదు. ఒకవేళ ఇకముందు కురిసినా ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండాలి. ఆ తర్వాతే నీరు దిగువకు శ్రీరాంసాగర్లోకి రావాలి. పైగా గోదావరిలో ఒక్కసారిగా వరద వస్తుంది. అటు కృష్ణా నదిపైనా ఎగువన ఉన్న కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుకొని కూర్చున్నది. అది నిండి, నారాయణపూర్ దాటి జూరాల ద్వారా తెలుగు రాష్ర్టాల్లోకి కృష్ణాజలాలు రావాలి.
ఏటా వేల టీఎంసీల గోదావరి జలాలు తెలంగాణ మీదుగా దిగువకు ప్రవహించినా, రెండు, మూడు లక్షల ఎకరాలకు కూడా నీటిని పారించలేని నిస్సహాయ స్థితిలో ప్రాజెక్టులు ఉండేవి. ఇకముందు తెలంగాణ అలాంటి గోస పడొద్దనే సీఎం కేసీఆర్ కాళేశ్వర మథనం చేపట్టారు. ప్రధాన గోదావరిలో వరద వచ్చే పరిస్థితి ఉండదని ముందుగానే గుర్తించి, తెలంగాణ అవసరాలకు పుష్కలంగా నీటిని అందిస్తూ ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండే ప్రాణహితను ఒడిసిపట్టాలని సంకల్పించారు. అదే విషయాన్ని సాంకేతిక రుజువులతో 2016 మార్చిలో శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే తెలంగాణకు జీవధారలు అని గణాంకాలతో సహా వివరించారు. ప్రాణహితను ఒడిసిపడితేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని, దాని కోసం చేపట్టిన రీడిజైనింగ్లో భాగంగానే కాళేశ్వర ఎత్తిపోతల పథకమని వెల్లడించారు. ఇప్పుడు అదే నిజమైంది. రాష్ట్రంలో చుక్క వర్షం లేకున్నా ఆదివారం నాటికి ప్రాణహితలో ఏకంగా నాలుగు టీఎంసీల నీరు ప్రవహిస్తున్నది.
నీటిపారుదల ప్రాజెక్టుల రీఇంజినీరింగ్, రీ డిజైన్లపై సీఎం కేసీఆర్ 2016, మార్చి 31న అసెంబ్లీలో పవర్ప్రాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి అవసరమైతే ఎస్సారెస్పీని కూడా నింపుతం. అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లి మల్లన్న సాగర్లో పడేస్తం. ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది. ఆ నీటిని ప్రాణహిత ఆయకట్టుతో పాటు నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు చేరవేస్తం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేం తక్కువ ఆలోచన చేయలేదు. పటిష్టంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నం’ అని నాడు ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన కండ్ల ముందు అవే దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రధాన గోదావరిలో వరద లేకపోయినా ప్రాణహితలో వస్తున్న 43 వేల క్యూసెక్కుల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ)లో నిల్వ చేసి.. లక్ష్మీ పంపుహౌజ్ నుంచి ఎత్తి పోస్తున్నారు. సరస్వతి, పార్వతి బరాజ్లు.. పంపుహౌజ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని అందిస్తూనే, వరద కాల్వకు ఎదురెక్కించి శ్రీరాంసాగర్లోకి తరలిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి కాళేశ్వరజలాలను శుక్రవారమే శ్రీరాంసాగర్లోకి వదిలారు. ఇక ముందు ప్రధాన గోదావరికి వరద రాకున్నా శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కాల్వకు నీళ్లు వదిలి సూర్యాపేట జిల్లా వరకు చెరువులను నింపే కార్యక్రమానికీ తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉన్నది.
వర్షాలు లేనప్పుడు కూడా తెలంగాణలో కరువు ఉండొద్దనే సీఎం కేసీఆర్ దీర్ఘకాలిక వ్యూహమే ఇప్పుడు రాష్ర్టానికి శ్రీరామరక్షగా మారింది. ఎంతటి కరువు పరిస్థితుల్లోనైనా ప్రాణహితలో వరద ఉంటుందని, ఆ జలాల్ని ఒడిసిపట్టుకుంటే చాలు! తెలంగాణ గడ్డ మీద నుంచి కరువును పారదోలవచ్చని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చెప్పిన మాట అక్షర సత్యమని స్పష్టమైంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావటంతో సీఎం దూరదృష్టి తాలూకు ఫలాలను తెలంగాణ సమాజం ఇప్పుడు కండ్లారా చూస్తున్నది. ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొగులు దిక్కు చూస్తుంటే.. ప్రభుత్వం ప్రాణహిత జలాల్ని ఒడిసిపట్టే పనిలో నిమగ్నమైంది. నేడు రాష్ట్రంలో కాళేశ్వర జలాల సవ్వడి మార్మోగుతున్నది. గోదావరిలో వరద లేకున్నా, కృష్ణా నదిలో నీళ్ల జాడ కనిపించకున్నా.. తెలంగాణ రిజర్వాయర్లు, వరద కాల్వలు నిండా నీళ్లతో తులతూగుతున్నాయి.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గాయత్రీ పంప్హౌస్ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయడంతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వర జలాలు ఎగువకు పరుగులు పెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి కాలువ వద్ద తూము నుంచి ఊర చెరువులోకి నీరు చేరి మత్తడి దుంకుతుండటంతో గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారు. – గంగాధర