చెన్నూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఆయన వాడీవేడి విమర్శలు చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నాటి కాంగ్రెస్ నేతల చేతగాని తనంవల్లే సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ కూడా సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం. సింగరేణి 134 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. మన అదృష్టానికి సింగరేణిని ప్రకృతి ప్రసాదించింది. ఇక్కడ బొగ్గు దొరుకుతున్నది. తెలంగాణలో 10 కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు కూడా వెలికి తీయలే. ఇంకా 8.5 కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. అసుంటి సింగరేణిని మునగ గొట్టినోడు ఎవడు..? ఇది అచ్చంగా తెలంగాణ కంపెనీ. దీంట్లో ఎవరి వాటా లేకుండె. నిజాం కాలంలో పెట్టుకున్న కంపెనీ ఇది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి్ంది. ఆ అప్పులు తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటాను కట్టబెట్టింది. ఇంతచేసి ఇప్పుడు ఫోజులు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలె. సింగరేణిని ఎవడమ్మిండు..? చేతగాక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సింగరేణి కార్మికులు చనిపోతే నాడు రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నరు. లక్ష చాలదని గొడవ చేసిన కార్మికులను జైళ్లల్ల పెట్టిండ్రు. తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణికి రూ.414 కోట్ల లాభం ఉండె. తెలంగాణ వచ్చినంక ప్రణాళికతో ముందుకు పోవడంతో, కార్మికులు ఉత్సాహంగా పనులు చేయడంతో ఇప్పుడు రూ.2,184 కోట్ల లాభానికి సింగరేణి చేరుకుంది. కార్మికులకు దసరా, దీపావళి బోనస్ మునుపెన్నడూ మూడునాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలే. ఈ ఏడాది రూ.1000 కోట్ల లాభాలను కార్మికులకు పంచుతున్నం. కాంగ్రెస్ రాజ్యంల లాభాల్లో కార్మికులకు 18 శాతమే వాటా ఇచ్చిండ్రు. ఇప్పుడు 32 శాతం వాటా ఇస్తున్నం. ఒక్కో కార్మికునికి సగటున రూ.2.5 లక్షల వరకు వస్తున్నది’ అని చెప్పారు.
‘తెలంగాణను మునగగొట్టింది వాళ్లే. ప్రాజెక్టులు కట్టకుండా బంద్ చేసింది వాళ్లే. సాగు నీళ్లు రాకుండా చేసింది వాళ్లే. సింగరేణి లాంటి కంపెనీలను ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. బాల్క సుమనో, కేసీఆరో కాదు. ఇది మీ అందరికి తెలుసు. అందుకే బాగా ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న. గతంలో సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే బ్రహ్మసోద్యం. కానీ ఇప్పుడు 45 వేల మంది కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినం. ఇంక్రిమెంట్లు ఇచ్చినం’ అని సీఎం చెప్పారు. అదేవిధంగా ‘డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ యూనియన్లే డిపెండెంట్ ఉద్యోగాల ఫైల్ మీద సంతకం పెట్టినయ్. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంకనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినం. అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కల్పించిన ఉద్యోగాలు కేవలం 6,400. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు 19,400. వాళ్లకు మాకు ఉన్న తేడా ఇది. కార్మికులు ఇండ్లు కట్టుకుంటమంటే రూ.10 లక్షల రుణం ఇస్తున్నం’ అని సీఎం అన్నారు.
బీజేపీపై కూడా సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చిపట్టకుంది. విమానాలు ప్రైవేటైజేషన్, రైళ్లు ప్రైవేటైజేషన్, ఓడలు ప్రైవేటైజేషన్, చివరికి బొగ్గు కూడా ప్రైవేటైజేషన్ అంటడు ప్రధాని నరేంద్ర మోదీ. మన బొగ్గును మనమెందుకు ప్రైవేటైజ్ చేయాలె..? మళ్ల వాన్ని బిచ్చమెందుకు అడుక్కోవాలె..? సింగరేణితో ఎంతో మందికి ఉద్యోగాలు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు. ఇన్ని కల్పిస్తున్న ఈ సింగరేణి బొగ్గును కూడా ఊడగొట్టాలని వాళ్లు ప్రైవేటైజేషన్ దుకాణం పెట్టిన్రు. కాంగ్రెస్ కథ అట్లుంటే, బీజేపీ పార్టీ వైఖరి ఇట్లున్నది’ అని ఎద్దేవా చేశారు.