జుక్కల్: కర్ణాటకలో కరెంటు సరిపోక రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జుక్కల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసే చోట ఉన్నదని, కర్ణాటకలో ఏం జరుగుతున్నదో, మహారాష్ట్రంలో ఏం గతి ఉన్నదో మీకందరికీ తెలుసని సీఎం సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు ముంబై సిటీ ఉన్నదని, అది హైదరాబాద్ కంటే పెద్దదని అన్నారు. అయినప్పటికీ అక్కడ నిత్యం 8 నుంచి 11 మంది రైతులు చనిపోతున్నారని సీఎం విమర్శించారు. ఆ రెండు రాష్ట్రాల్లో రైతులను పట్టించుకునే నాథుడే లేడని చెప్పారు.
కర్ణాటకలో కరెంటు కొరతపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో 24 గంటల కరెంటు ఇస్తమని కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నది. తీరా ప్రజలు గెలిపించినంక 5 గంటలే కరెంటే ఇస్తున్నరు. దాంతో రైతులు గోస పడుతున్నరు. కరెంటు లేక పంటలకు నీళ్లు చాలడం లేదని రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నం గప్పాలు చెప్పిండు. కావాలంటే మీరు వచ్చి సూడుండ్రి బస్సులు పెడతం అన్నడు. దిక్కుమాలినోడా మేం 24 గంటల కరెంటు ఇస్తుంటే మీ 5 గంటల కరెంటు సూడనీకి మేమెందుకు రావాలె అన్నం’ అని తెలిపారు.
‘దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు లెస్స మాట్లాడుతున్నరు. రైతుబంధు పథకం వద్దు అంటున్నరు. ప్రజాధనం వృథా అయితున్నది అంటున్నరు. వాస్తవానికి రైతుబంధుతో రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు తెచ్చుకునే దుస్థితి తప్పింది. రైతు బీమా పథకం కూడా రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నది. రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. ఆ రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నం. పంట రుణాలు మాఫీ చేశాం. కాంగ్రెస్, బీజేపీ కుయుక్తులవల్ల ఇంకా కొందరికి పంట రుణాలు మాఫీ కాలేదు. ఎన్నికల తర్వాత వాళ్ల రుణాలు కూడా మాఫీ అయితయ్. ఇందులో ఏం ఫికర్ అక్కర్లేదు’ అని సీఎం చెప్పారు.