మల్లన్న సాగరం.. జాతికి అంకితం
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం.. చరిత్రాత్మక ఘట్టం
కష్టాలకోర్చితే గానీ ఈ కల సాకారం కాలేదు
ప్రాజెక్టుపై వందల కేసులేశారు.. స్టేలు తెచ్చారు
ఏమీ తెలియని వెధవలు విమర్శిస్తున్నారు
50 డిగ్రీల ఎండలో పడ్డ కష్టం వృథా కాలేదు
ప్రపంచానికి అద్భుతం చూపిన మన ఇంజినీర్లు
మల్లన్న నిర్వాసితుల త్యాగం వెల కట్టలేనిది
మరో 100 కోైట్లెనా.. కడుపునిండా పరిహారం
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
శిరస్సు వంచి ప్రణామాలు చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏ సస్యశ్యామల తెలంగాణను చూడాలని కోరుకున్నామో అది సాధ్యమైంది. ఈ మహాయజ్ఞంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రజల పక్షాన శిరస్సు వంచి వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తున్నా.
రానేరాదిక కరువు
కరువు రాకూడదు.. ఒకవేళ వచ్చినా.. తెలంగాణకు కరువు రాకుండా కాపాడేదే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువుతో ఆల్లాడినా మనకు మాత్రం కరువురాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీలు ఉన్న ప్రాంతం అంతా ఎక్కడా కరువు రాదు.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి, కడుపు కట్టుకొని, అవిశ్రాంతంగా పనిచేయడం వల్లే అద్భుతమైన మల్లన్నసాగర్ కల సాకారమైందని తెలిపారు. తనతోపాటు ఇంజినీర్లు, అధికారులు పడిన కష్టం వృథా కాలేదని, తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని సంతోషం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టువల్ల దేశం మొత్తానికి కరువొచ్చినా తెలంగాణకు మాత్రం రాదన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి కడుపునిండేలా పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం మల్లన్నసాగర్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
కల సాకారమైంది
చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. మనం కలలుగన్న తెలంగాణతోపాటు సస్యశ్యామల తెలంగాణను చూడాలన్న కోరిక నెరవేరింది. నూతన తెలంగాణలో నిర్మాణమైన అతి భారీ జలాశయం మల్లన్నసాగర్ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టం. ఈ కల సాకారం కావడానికి, ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రజల పక్షాన శిరస్సు వంచి వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తున్నా.
దుర్మార్గులు స్టే తెస్తే.. చీఫ్ జస్టిస్తో మాట్లాడిన..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక దశలో ఈ కొస నుంచి ఆ కొస దాక ఒకే సమయంలో 58 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ దుర్మార్గుడు కోర్టుకెళ్లి పనులపై స్టే తెచ్చిండు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా.. అక్కడి నుంచే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫోన్ చేసి.. ‘ఇది చిల్లర వ్యవహారం కాదు.. తెలంగాణ ప్రజల జీవనాడి, వాళ్ల బతుకుదెరువుకు సంబంధించి విషయం. మీరు ఉన్నత న్యాయమూర్తి కాబట్టి దయచేసి మంచిగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరాను’ అప్పుడు ఆయన ‘నాకు వివరాలు ఇవ్వండి. న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నంచేస్తా’ అని చెప్పారు. నేను వెళ్లి విషయాలన్నీ చెప్పిన తర్వాత.. ఆయన కన్వీన్స్ అయి, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కొన్ని దుష్టశక్తులు 600 పైచిలుకు కేసులు వేశాయి. 14 రాష్ర్టాల నుంచి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు దేశవ్యాప్తంగా లేబర్ను, యంత్రాలను సమకూర్చి పనిచేశాయి. ఒకసారి ఒక దుర్మార్గుడు చేసిన పనికి కోర్టులో స్టే వస్తే.. పని ఆగిపోతే, లేబర్ చెదిరిపోతే.. మళ్లీ వాళ్లను ఒకచోటికి తేవడానికి కనీసం సంవత్సరం పడుతుంది.
ఇంజినీర్లు ధర్మం, న్యాయం కోసం పనిచేశారు..
రిటైర్ అయినప్పటికీ నా కోరికను మన్నించి వృద్ధాప్యంలో కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్రావు, మరో ఈఎన్సీ హరిరామ్, వీరివెంట పనిచేసిన ఇంజినీర్ల బృందానికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు కోసం ఎండనక, వాననక రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. ఒక సందర్భంలో ఓ ఇంజినీరుపై హైకోర్టులో నాలుగుసార్లు కంటెమ్ట్ కేసులు వచ్చాయి. అప్పుడు నేను అతడిని భయపడుతున్నవా? అని అడిగాను. అప్పుడు ఆయన నాతో ‘ఏం సార్ నేనేమైనా దొంగతనం చేసిన్నా. పోతే జైలుకు పోతా. రెండు నెలలు శిక్ష వేస్తే ఉండొస్తా. నేను బయటకు వచ్చినంక వందలు, వేల మంది ప్రజలు ఊరేగింపు చేస్తరు సార్. నేనేం తప్పు పని చేసి జైలుకు పోతలేను కదా’ అని అన్నరు. తడి ఆరి, గొంతు ఎండిపోయి, భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం జరగాలని పని చేస్తున్నం కాబట్టి ధైర్యంగా ముందుకు పోతామే తప్ప వెనక్కిపోమని చెప్పారు. ఇంజినీర్లు కూడా భయపడకుండా ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేశారు.
గోదావరి నీళ్లతో మల్లన్న పాదాలకు అభిషేకం
గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను అభిషేకించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పిన. చెప్పినట్లే ఇయ్యాల మల్లన్నసాగర్ను ప్రారంభించుకొంటున్నాం. ఈ కార్యక్రమం తర్వాత ఐదు కలశాల్లో గోదావరి జలాలను తీసుకెళ్లి మల్లన్న పాదాలను అభిషేకిస్తా. ఎంతో మనుసు పెట్టి, హృదయం పెట్టి, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతోమంది దుర్మార్గులు ఎన్ని రకాల నిందలు పెట్టినా వెరవకుండా ముందుకు పోయినం. నేను ఒక్కణ్ణి చేస్తేనే కాదు. హరీశ్రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు తన విలువైన సేవల్ని అందించారు. మొదటి టర్మ్లో ఆయనే ఇరిగేషన్ మంత్రి. దుర్మార్గులు అనేక రకాల ఇబ్బందులు పెట్టినా, బదనాంలు పెట్టినా వెరవకుండా చాలా నిబద్ధతతో క్రమశిక్షణతో, కడుపుకట్టుకొని పూర్తి అవినీతిరహితంగా, అనేక దుర్మార్గమైన అవాంతరాలను, అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యాన్ని నివారిస్తూ ముందుకు సాగితేనే మల్లన్నసాగర్ సాకారమైంది.
ఇది తెలంగాణ జన హృదయ సాగరం..
ఇది కేవలం ఒక మల్లన్నసాగర్ కాదు.. ఇది తెలంగాణ జన హృదయసాగరం, తెలంగాణ జల చరిత్ర సాగరం, తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. ఎందుకంటే తెలంగాణ రాకముందు అత్యంత ఎత్తులో ఉన్నది సింగూరు ప్రాజెక్టు. దాన్ని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తు ఎఫ్ఆర్ఎల్తో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఒక్క సిద్దిపేట జిల్లాకే కాదు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను తీర్చే మహత్తరమైన జల భాండాగారం. అదేవిధంగా నిజాంసాగర్ కిందగల నిజామాబాద్ జిల్లాకు, సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల కోసం కట్టిన సింగూరు ప్రాజెక్టుకు, బస్వాపూర్, గంధమల్ల ద్వారా ఆలేరు ప్రాంతానికి, చేర్యాల, మద్దూరు, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, తూప్రాన్ ప్రాంతాలను ఈ జలాలతో నింపుతూ దాదాపు 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడే అద్భుతమైన ప్రాజెక్టు. ఎక్కడ నీళ్లు అవసరం పడితే అక్కడికి నీళ్లు పంపించుకొనే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి దాదాపు ఐదో, ఆరో స్లూయిజ్లను అన్ని లెవల్స్లో పెట్టారు. దీంతో ఏ లెవల్లో నీళ్లున్నా తీసుకోవచ్చు.
నిర్వాసితుల త్యాగం వెల కట్టలేనిది
ఎవరివైతే భూములు పొయినవో, ఏ ఊర్లు మునిగాయో వాళ్ల త్యాగం అసమానమైనది, వెలకట్టలేనిది. మంత్రి హరీశ్రావుకు, జిల్లా కలెక్టర్ హనుమంతుకు చెప్తున్నా.. ఎవరైనా ఇంకో పదో, యాభై, వందమందో తమకు కూడా తృణమో ఫలమో రావాలని కోరుకునే వాళ్లు, మిగిలిపోయిన వాళ్లు ఉంటే వారితో స్వయంగా మాట్లాడి.. వారి కడుపునిండేలా పరిహారం ఇప్పించాలి. ఇంతటి సంతోషకరమైన సందర్భంలో, ఇంత గొప్ప మహాయజ్ఞంలో వాళ్లు కూడా సంతోషంగా ఉండాలి. పోతే ఇంకో రూ.100 కోట్లు పోతయి. ఇది పెద్ద విషయం కాదు. కానీ వాళ్లను తృప్తిపరచాలి.
దశలవారీగా మల్లన్న సాగర్లోకి నీళ్లు…
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ను కూడా ప్రారంభం చేసుకున్నం. దీన్ని ఒక్కసారే పూర్తిగా నింపరు. మూడు సంవత్సరాలు కావాలి. 50 టీఎంసీలు నింపాలంటే సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం క్రమంగా నింపుతూ వెళ్లాలి. పని మాత్రం ఆగదు.. నీళ్లు పోస్తనే ఉంటరు.. వ్యవసాయానికి నీళ్లు అందుతయి. ప్రస్తుతం ఇందులో 10.64 టీఎంసీల నీళ్లు ఉన్నయి. ఇంకో ఐదున్నర టీఎంసీలు తెచ్చి మొత్తం 16 టీఎంసీలను నిల్వ ఉంచుతరు. వర్షాకాలం తర్వాత మరో 16 టీఎంసీలతో ప్రాజెక్టును నింపుతరు.
త్వరలో పాలమూరుకు జలకళ
మేం ఉద్యమానికి పోయే సమయంలో మిత్రుడు వీ ప్రకాశ్.. నాతో ఓ మాట అన్నడు. ‘ఇటువంటి నీళ్లు కండ్ల చూస్తమా? ఆ దుర్మార్గులు కానిస్తరా అన్నా..’ అని చాలా ఆవేదన పడేవాడు. కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా ఒక్క మల్లన్నసాగరే కాదు.. మల్లన్నసాగర్లాంటి సాగరాలు పాలమూరు జిల్లాలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆ జిల్లా మంత్రి శ్రీనివాస్గౌడ్ ‘అన్నా మాదెప్పుడు పూర్తయితది.. తొందరగా పూర్తిచేయండి’ అని అడుగుతున్నడు. అక్కడ కూడా త్వరలోనే పనులు పూర్తవుతయి. 70 టీఎంసీల నీళ్లు నిల్వచేసే రిజర్వాయర్ల నిర్మాణం దగ్గర పడింది. అదికూడా తొందర్లోనే సాకారం కాబోతున్నది.
నిర్వాసితుల కడుపునింపుతాం
ఈ భూమిమీద ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా గాలిలో కట్టడమనేది సాధ్యం కాదు. భూమి మీదనే కట్టాలి. ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని గ్రామాలు, కొన్ని భూములు మునుగుతయి. ఇక్కడ కూడా కొన్ని గ్రామాలు మునిగాయి. అవన్నీ కూడా నాకు ప్రాణప్రదమైన గ్రామాలే. నాకు పరిచయమున్న గ్రామాలే. నేను సిద్దిపేటలో చదువుకున్నప్పుడు చాలామంది స్నేహితులు ఉన్న గ్రామాలే. అయినా కూడా తప్పదు.. వారిని సముదాయించాలి. ప్రాజెక్టును ఎంతపెట్టి కడతరని అడిగాను. అప్పుడు ఇంజినీర్లు ఓ లక్ష కోట్లకు పైగా అవుతయి సార్.. పొలాల్లోకి వెళ్లే కాల్వలు కూడా పూర్తి కావాలంటే సమయం పడుతుంది. మొత్తం పూర్తయ్యేనాటికి కాళేశ్వరం ఖర్చు రూ.లక్ష కోట్లు దాటుతదని చెప్పారు. లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టే మీరు.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రిజర్వాయర్లు, కాల్వల కోసం భూములిచ్చే వారికి న్యాయం చేయండని చెప్పిన. నా కుటుంబం కూడా అప్పర్ మానేరు ప్రాజెక్టులో మునిగిపోయిన కుటుంబమే కాబట్టి ఆ బాధ ఏమిటో నాకు తెలుసు అని, వారికి కడుపు నిండా న్యాయం చేయాలని చెప్పిన. ఆ రోజు ఎక్కడా లేనటువంటి, చరిత్రలో ఎక్కడా ఇవ్వనటువంటి పరిహారం ఇచ్చేందుకు మేం జీవో తెచ్చాం. కానీ కొందరు దుర్మార్గులు దానికి వక్రభాష్యం చెప్పి.. చాలామంది అమాయకుల నోట్లో మన్నుపోశారు. ఏదో సాధించినట్టుగా రాబిన్హుడ్లా ఒకడు ముసుగేసుకొని ఇక్కడికి వచ్చుడు.. మరొకడు రాత్రి వచ్చుడు.. కొంతమంది చీకట్ల మీటింగ్లు పెట్టుడు.. ఇలా చాలా పిచ్చిపిచ్చి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాజెక్టు కాకూడదని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ ముందుకు వెళ్లినం.
దేశానికి కరువొచ్చినా.. తెలంగాణకు మాత్రం రాదు
కరువు రాకుడదు.. ఒకవేళ కరువు వచ్చినా.. తెలంగాణకు కరువు రాకుండా కాపాడేదే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువుతో అల్లాడినా మనకు మాత్రం కరువురాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీలు ఉన్న ప్రాంతం అంతా ఎక్కడా కరువు రాదు. ‘గోదావరి నది ఒరుసుకుంటా పారే జిల్లాల్లో కరువు ఎట్లా ఉంటది? ఇది వివక్ష, అన్యాయం కాకపోతే మరేమిట’ని ఉద్యమ సమయంలో నేను అడిగాను. ఈ రోజు ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకొంటున్నది. తొందర్లోనే పూర్తి కాబోతున్నది. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఉద్యమ వేడిని తగ్గించేందుకు నక్కజిత్తుల నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రాజెక్టు దేవాదుల. అది కూడా ఈ రోజు సాఫల్యమైంది.. సమ్మక్క సాగరం కట్టుకున్నాం. 365 రోజులు నీళ్లు వస్తయి. దీన్ని వరంగల్ జిల్లాకు అంకితం ఇస్తున్నాం.
మేం పడ్డ కష్టం వృథా కాలేదు
నాతో పాటు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎస్ఈ రమణారెడ్డి లాంటి వాళ్లు అప్పుడు పడిన కష్టం జ్ఞాపకమొస్తే నా కండ్లకు నీళ్లొస్తున్నాయి (ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కండ్లలో కన్నీళ్లు సుడులు తిరిగాయి). 50 డిగ్రీల మండే ఎండలో, గోదావరి నదిలో మేం పడ్డ కష్టం వృథా పోలేదు. ఆ ఇద్దరు ఇంజినీర్లు మహారాష్ట్రకు వెళ్లి చేసిన ప్రయత్నాలు, అక్కడి కలెక్టర్ వద్దకు తిరగడాలు.. ఇలా ఎంతో మందిమి ఎన్నో రకాల కష్టం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే కచ్చితంగా మొండిపట్టుతో చేస్తేనే అయితది కాబట్టి ఆ పట్టుదలతోనే నేను పనులు చేసిన.
మన ఇంజినీర్లు.. ప్రపంచానికి అద్భుతం చూపారు
తెలంగాణ ఇంజినీర్లు ఇరిగేషన్లో ప్రపంచానికే అద్భుతం చూపారు. కాళేశ్వం ప్రాజెక్టు అందుకు నిదర్శనం. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డిస్కవరీలో ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టు ఖ్యాతిని చాటారు. న్యూయార్క్ టైమ్స్ స్కేర్లో నెలల తరబడి ప్రదర్శితమైన ప్రాజెక్టు. అందుకే మల్లన్నసాగర్ వద్ద అద్భుతమైన ఇరిగేషన్ కాంప్లెక్స్ నిర్మించాలె. రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ శిక్షణ ఇక్కడే కొనసాగాలి. అందుకోసం రూ.100 కోట్లను కేటాయిస్తున్న. ఇరిగేషన్ సెక్రటరీ రజత్కుమార్ ఆ పనిని వెంటనే ప్రారంభించాలి. ప్రాజెక్టులో పనిచేస్తున్న కలెక్టర్లు, ఇంజినీర్లు, భూమిని త్యాగం చేసిన నిర్వాసితులు, ప్రజాప్రతినిధులకు పేరుపేరునా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
ప్రాజెక్ట్ అంటే తెలియని వెధవలు
ప్రాజెక్ట్ అంటే ఏమిటో కనీస పరిజ్ఞానం, అవగాహన లేనివాళ్లు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నరు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మిడ్మానేరు ప్రాజెక్టును నింపుతున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లిని, మిడ్ మానేరును కూడా పూర్తి చేసినం. ఏ ప్రాజెక్టు కట్టినా.. దాని కట్ట నుంచి కొన్ని నీళ్లు బయటకు రావాలి. ఒత్తిడి బయటకు వెళ్లితే కట్ట ప్రమాదంలో ఉండదు. భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు అంచనాలు మారుతయి, మార్పులు చేర్పులు అవుతయి, చిన్న చిన్న తప్పులు జరుగుతయి, వాటన్నింటినీ సరి చేస్తరు. కానీ ఆ కాస్త పరిజ్ఞానం కూడాలేని కొంత మంది వెధవలు మిడ్మానేరు వద్దకు వెళ్లి… బురద వస్తుంది, దీన్ని చాలా బలహీనంగా కట్టారని దిక్కుమాలిన సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టారు. మేం చాలా బాధపడ్డం. ఈ దరిద్రపు గాడిదలు తెలంగాణలో ఎక్కడి నుంచి పుట్టారు? వీళ్లకు పరిజ్ఞానం లేదు. తెలివి కూడా లేదని చెప్పిన. ఇప్పుడే హరిరామ్ను అడిగాను.. మల్లన్నసాగర్లో నీళ్లు నింపితే కట్ట నుంచి నీళ్లు వస్తున్నయేంటని అడిగాను. నాకు కూడా పరిజ్ఞానం లేదు. నేను కూడా నేర్చుకున్నదే. సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు.. దాని కట్ట మొత్తం నల్లమట్టితో ఉంటుంది. నీళ్లు బయటకు రావు.. దీంతో కట్టకింద మూడు నాలుగు వందల బోర్లు వేసి.. అందులో కంకర నింపి, అడుగు నుంచి వచ్చే నీళ్లను వాగుల ద్వారా బయటకు వచ్చే ఏర్పాటుచేశారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే ప్రాజెక్టు నుంచి ఒత్తిడి బయటకు వెళ్లే మార్గం ఉండాలి సార్ లేదంటే ఇబ్బంది అవుతదని చెప్పారు. గోదావరిలో మనం బరాజ్లు కట్టినం.. మనకు అన్నం పెట్టు లక్ష్మి బరాజ్ కట్టినం. నదిలో డ్యాం కింద దాదాపు 400 బోర్లు వేసి అందులో కంకర నింపారు. లేకపోతే ఆ డ్యాం లేచిపోతది. టెక్నికల్ విషయాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు తూములు కొంచెం వీక్గా ఉన్నట్లున్నవి.. వాటి డిజైన్ మార్చాలని కోరుతున్నాను. చిన్న చిన్న లోపాలుంటే సవరించాలి. ఈ పిచ్చి వెధవల మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేయాలని ఇంజినీర్లను కోరుతున్నా.
ప్రతిపక్షాలు ఆలోచించాలి
ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు ఆలోచించాలి.. ఏడేండ్ల కింద తెలంగాణ ఎట్ల ఉండే.. ఇయ్యాల తెలంగాణ ఎట్ల ఉన్నది. ఏడేండ్ల కింద తెలంగాణలో భూములు ఎంత ఉండే.. ఎప్పుడు ఎంత ఉన్నయి. తెలంగాణను అనుకొని ఉన్న మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలో పరిస్థితులు ఏమిటి? తెలంగాణలో పరిస్థితులు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ను మించి పంజాబ్తో పోటీ పడుతూ తెలంగాణ ధాన్యం పండిస్తున్నది. తెలంగాణలో పంటలు పండించే అతిపెద్ద ఆధారం కరెంటు మీటర్లు, 30 లక్షల బోర్లు. మిషన్ కాకతీయ నుంచి ప్రారంభమైన మన యజ్ఞంతో చెరువులు నింపుకొన్నం. ప్రతి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిండాలి, ప్రతి చెరువు నిండాలి, ఏప్రిల్ నెలలో కూడా చెరువులు తొలుకులు పడుతూ ఉండాలి.
ఎవుసం గోస తీర్చిన దేవుడు
గప్పట్ల ఎవుసం చేయాలంటే శాన తిప్పలు పడ్డాం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ అచ్చినంకా రైతుల గోస తీర్చేందుకు గీడ మల్లన్నసాగర్ కట్టిండు. సీఎం కేసీఆర్ సార్ ఎవుసానికి నీళ్లు అందిస్తూ మాకు దేవుడైండు. సీఎం కేసీఆర్ సార్ను ఆ దేవుడు సల్లంగ చూడాలె.
– చిక్కుడు పోశవ్వ, మహిళా రైతు, తుక్కాపూర్, మం: తొగుట, సిద్దిపేట జిల్లా
ఏండ్ల నాటి మా బాధలు తీరినట్టే..
నేను పుట్టినకాడినుంచి గిప్పటి దాకా రైతుల కొరకు ఆలోచించిన నాయకులు లేరు. మా రైతులు బాగుపడటానికి సీఎం కేసీఆర్ సార్ మల్లన్నసాగర్ కట్టిండు. మల్లన్నసాగర్ను గింత మంచిగా కట్టి, ఇయాళ షురూ చేసిండు. ఏండ్ల నాటి మా బాధలు తీరుతయి. మాకు మస్తు సంబురంగా ఉన్నది. పేదోళ్ల కోసం సీఎం సార్ కష్టపడుతున్నరు. మేమంతా కేసీఆర్ సార్కు అండగా ఉంటాం.
– సింధు కనుకయ్య, రైతు, తుక్కాపూర్, మం: తొగుట, సిద్దిపేట జిల్లా