హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత కాలనీలు, గిరిజన తండాల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిధుల అవసరాన్ని బట్టి ఒకటి రెండేండ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలోని తండాలు, దళిత కాలనీల్లో రోడ్లు లేవని పలువురు ఎమ్మెల్యేలు వినతులు ఇస్తున్నారని తెలిపారు. నారాయణఖేడ్కు ఇటీవలే రూ.70 కోట్లు ఇచ్చినా మళ్లీ వస్తున్నారని, ఈ నేపథ్యంలో దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించానని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఒకేసారి విడుదల చేసి ఆ పనులు చేయిస్తామని వివరించారు. పనులు ఒకేసారి వీలుకాకుంటే దశలవారీగా ఒకటిరెండేండ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయని, వారు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు. మోడల్గా తీసుకున్న చింతకాని మండల ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు 100 శాతం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
వైద్యశాఖలో దళితులకు రావాల్సిన ప్రమోషన్లు వస్తలేవని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని సీఎం తెలిపారు. ఈ శాఖ తనవద్దే ఉన్నదని, వారికి ఎలాంటి అన్యాయం జరగనివ్వనని హామీఇచ్చారు. పక్కాగా పదోన్నతులు ఇస్తామని, ఇతర శాఖల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటే సరిదిద్దుతామని స్పష్టంచేశారు. అట్రాసిటీ కేసులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. చింతకాని మండలానికి చెందిన మరియమ్మ అనే దళిత మహిళను పోలీసులు దుర్మార్గంగా కొట్టి చంపితే వారిపై తీవ్ర చర్యలు తీసుకున్నామని, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరిగే అకృత్యాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే వారికి ఏ గతిపడుతుందో ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఉన్నదన్నారు. ‘మా దళితబిడ్డలకు టౌన్లల్ల రూంలు కిరాయికి ఇస్తలేరు అన్నరు. ఇంకా ఉన్నారా అటువంటి దరిద్రులు అని తిట్టి, అప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీని పిలిచి 30 పట్టణాల్లో మహిళా డిగ్రీ హాస్టళ్లతో సహ కాలేజీలు పెట్టినం. డిగ్రీ కోర్సుతోపాటు ఇతర కోర్సుల్లో దాదాపు 20 వేల మంది దళితవిద్యార్థినులు సగర్వంగా చదువుతున్నరు’ అని తెలిపారు.
‘మాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. డెఫినెట్గా సెకండ్ టర్మ్ కూడా మనమే మంచి మెజార్టీతో వస్తున్నం. గెలిచిన తరువాత దళితుల కోసం ప్రత్యేక ప్రోగ్రాం తీసుకుంటాం’ అని గత శాసనసభ ఎన్నికలకు ముందు చెప్పినట్టు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో కొన్ని భూములు అమ్మకానికి పెడితే ఎకరం 40 కోట్లకు అమ్ముడుపోయిందని, ఒకేసారి సుమారు రూ. 2,700 కోట్లు వచ్చాయని చెప్పారు. అందులో కొంత సొమ్మును దళితుల కోసం వినియోగించినట్టు వెల్లడించారు. ‘దళితుల కోసం ఎందుకు పెట్టొద్దు? డెఫినెట్గా పెడతం. ముందు రూ.1,000 కోట్లు పెట్టినం. వెసులుబాటు కలిగింది కాబట్టి మరింత పెడుతం’ అని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. ఆర్బీఐ, కాగ్ ఇచ్చే లెక్కల ప్రకారం 11.5 శాతం వృద్ధి రేటు ఉన్నదని, ఇటీవలే ‘ది బెస్ట్ వన్ ఇన్ ఫోర్ బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్’ అని ఆర్బీఐ కితాబిచ్చిందని సీఎం గుర్తు చేశారు.