CM KCR | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడటమే సమాజ హితమని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురసరించుకొని ముస్లిం ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని వివరించారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.