హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు మధ్యలో 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవి సాగుకు పనికిరాని బంజరు భూములై ఉండటంతోపాటు విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కి.మీ. దూరంలోపు ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సోమవారం ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమారతో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసం హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో బంజరు భూములను గుర్తించాలని, అవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, వాటిలో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించని భూములపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
బల్క్డ్రగ్స్ పరిశ్రలపై విదేశాల్లో అధ్యయనం
రాష్ట్రంలో కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. హైదరాబాద్లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరారు. బల్డ్రగ్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటు కోసం మధ్య ప్రాచ్య, యూరప్ దేశాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయాలని తెలిపారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్తును కాకుండా సోలార్ పవర్ను ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలోని గ్రామాలను మాడల్ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా బాలానగర్లోని ఐడీపీఎల్ భూములపై కూడా ఆరా తీసిన సీఎం రేవంత్.. వాటి పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాసర్, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్రెడ్డి, షానవాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
ప్రతి ఏటా నిర్వహిస్తున్న తరహాలోనే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలను ఈ నెల 22న అధికారికంగా నిర్వహించనున్నారు. ఇం దుకు ఎల్బీ స్టేడియం వేదిక కానున్న ది. వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ ఒక ప్ర కటనలో సోమవారం వెల్లడించారు.