Telangana Cabinet | భారీ వర్షాలతో సంభవించిన వరదల నేపథ్యంలో తక్షణ సహాయం కింద రూ.500కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం దాదాపు ఐదుగంటల పాటు జరిగింది. భేటీ అనంతరం మంత్రులతో కలిసి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దాదాపు ఐదున్నర గంటల పాటు సమావేశమై ముఖ్యమైన విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ నెల 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
అనూహ్యరీతిలో వచ్చిన అతిభారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, జరిగిన నష్టాన్ని కేబినెట్ అన్నిశాఖలతో చర్చించింది. సమగ్ర సమాచారన్ని సేకరించింది. పూర్వ వరంగల్ జిల్లాతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పది జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలకు జరిగిన నష్టంపై సమీక్షించింది. తక్షణ సహాయం కింద రూ.500కోట్లు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. దీన్ని ఎక్కడ అవసరం అవసరమైతే అక్కడ యుద్ధప్రాతికదికన తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించారు’ అని వివరించారు.
‘వరదల్లో దాదాపు 27వేల మందికి పునరావాస కేంద్రాలకు తరలించామో.. వారు ఎక్కడివారక్కడ ఉండేలా చూడాలని కేబినెట్ ఆదేశించింది. అలాగే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించి.. తనంతట తనను తాను ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. ఆగస్టు 15న ఇద్దరిని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారిని కేబినెట్ను అభినందించింది. ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడారు. ఆయనను కూడా సన్మానించాలని సీఎం కేసీఆర్, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖమ్మం పట్టణం నుంచి మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడువునా ఉన్న నది వెంట ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్బ్యాంక్ను నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించింది’ అని వివరించారు.
‘వర్షాల వల్ల చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. 40 మంది మరణించిన వారి వివరాలను సేకరించి.. వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. వరదలతో పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కొన్నిచోట్ల ఇతర సమస్యలు వచ్చాయి. వాటిని పరిశీలించి సమగ్రను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని కలెక్టర్లకు సీఎస్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలతో తెగిన రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు’ అని కేటీఆర్ వివరించారు.