హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా జాతీయ గీతాలాపన జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామకంఠంలో నూతన ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించింది. వికారాబాద్లో ఆటో నగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తాండూరు మార్కెట్ కమిటీ యాలాలలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.