హైదరాబాద్ : ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు నిర్ణయం తీసుకుంది. అదే ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.