Free Bus | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఈ పథకం అమలుపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఆ రాష్ర్టాల్లో ఉచిత ప్రయాణం ఏయే క్యాటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనున్నదనే దానిపై అధ్యయనం చేసింది. కర్ణాటకలో ఈ పథకం కోసం ఎంత ఖర్చు అవుతున్నది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తున్నది? వంటి విషయాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ నివేదికను సీఎంకు శుక్రవారం అందజేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది. దీన్నిబట్టి కర్ణాటక మాడల్నే ఇక్కడా అమలు చేయాల్సి ఉన్నది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2,200 కోట్లు, పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో అమలు చేస్తామని చెప్పడంతో ఈ ఖర్చు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేయటం వల్ల ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు ప్రారంభించింది. అయితే కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ రంగు బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అకడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రస్తుతం అక్కడ మహిళలకు జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే.. రూ.సున్నా ఉండే జీరో టికెట్ను జారీ చేస్తున్నారు. దీని ద్వారా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెకిస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెకిస్తారు. ఇకడ అదే పద్ధతిని అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం టికెట్ మిషన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించాల్సి ఉంటుందని, దాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కనీసం రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.