హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి ఇన్నేండ్లయినా దళితవాడలు నేటికీ వెనుకబాటుతనానికి, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయి. ఈనేపథ్యంలో అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతున్నది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు.