హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే కరెంటు కష్టాలకు చరమగీతం పాటిని తెలంగాణ ఇప్పుడు పవర్హౌస్గా మారింది. రెప్పపాటు కోతలు విధించకుండా అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు అందిస్తున్నది. దేశంలో వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2014-15 నుంచి 2021-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.36,890 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు తెలంగాణ పవర్హౌస్ ప్రకటన విడుదల చేసింది. ‘సీఎం కేసీఆర్ దార్శనికత, వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఎనిమిదేండ్లలో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటును అందుబాటులోకి తెచ్చారు. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు విద్యుత్కు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి నేడు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు పొందేలా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2014 నుంచి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీస్లు విడుదలయ్యాయి. రైతన్నకు ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.36,890 కోట్లు సబ్సిడీగా అందించింది.
గత ఎనిమిదేండ్లలో అన్నివర్గాలకు రూ.37,099 కోట్లతో సరఫరా, పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. 2014 నుంచి ట్రాన్స్కో ద్వారా 400కేవీ సబ్స్టేషన్లు 17, 200కేవీ సబ్స్టేషన్లు 48, 132కేవీ సబ్స్టేషన్లు 72, ఈహెచ్టీ సబ్స్టేషన్లు 137, 11107సీకేఎం ఈహెచ్టీ లైన్, డిస్కంల ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ 1038లు 3.65 లక్షల డీటీఆర్లను ప్రభుత్వం నిర్మించింది. దీంతో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పటిష్ట పరిచింది. 14160 మెగావాట్ల పీక్ డిమాండ్ను కూడా అందుకున్నది.
గతంలో పవర్ హాలిడేలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్తో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీంతో కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లుగా ఉంటే 2021 నాటికి అది 2012 యూనిట్లుకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73 శాతంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం.
రాష్ట్రంలో 2.47 శాతం అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98 శాత ట్రాన్స్మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే తెలంగాణ ఘనత సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06 శాతంగా ఉన్న టీ అండ్ డీ నష్టాలను 11.01 శాతానికి తగ్గించగలిగాం. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్లో సామర్థ్యం 73 మెగావాట్లుగా ఉంటే నేడు అది 4950 మెగావాట్లకు చేరింది. ఒకపక్క విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకుంటూ మరోపక్క సరఫరా పంపిణీ ప్రాధాన్యతనిస్తుంది.
రైతులకు ఉచిత విద్యుత్తోపాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెల 5,96,642 మంది ఎస్సీ వినియోగదారులకు, 3,21,736 మంది ఎస్టీ వినియోగదారులకు 2017 నుంచి ఇప్పటివరకు రూ.656 కోట్ల విలువైన విద్యుత్ను ఉచితంగా పంపిణీ చేశాం. వీరితోపాటు 29,365 నాయిబ్రాహ్మణుల సెలూన్లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. 6,667 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లూమ్స్కు యూనిట్కి రూ.2 సబ్సిడీ ఇస్తున్నది’ అని పేర్కొన్నది.