Telangana Bonalu | తెలంగాణలో బోనాల పండుగ మస్త్ ఫేమస్. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో పల్లె నుంచి పట్నం వరకు బోనాల పండుగతో సందడిగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ జంటనగరాల్లో బోనాల సందడి అంతా ఇంతా కాదు. బోనాల వేడుకను తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నది. ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే ఆదివారం వేడుకలు ప్రారంభమవుతుంటాయి. అయితే, బోనాల పండుగకు ఎంతో చారిత్ర పాశస్త్యం ఉన్నది. అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం కొనసాగుతున్నది. కొండ కోనల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన పత్రి, పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించాడు. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణనే బోనాల వరకు వచ్చింది. పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది.
600ఏళ్ల నాటి పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. 1676లో కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మగుడిని సర్వాయి పాపన్న కట్టించి, ఆ దేవతకు బోనాలు సమర్పించినట్టు కైఫీయతుల్లో గౌడనాడులు గ్రంథంలోనూ ఉన్నది. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే.. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వచ్చి ప్రబలడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు.. గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాలు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్ షా (తానీషా ) కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్రకారులు చెబుతుంటారు.
రుతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభంకాగానే మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉన్నది. వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడుతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా.. బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు. భోజనం ప్రకృతి అయితే.. దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుచుకుంటారు.
బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబురాలకు సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారమూ ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం చేయడాన్ని చూడవచ్చు. పండుగలో జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది.