Harish Rao | ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. నీ గురువు కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన గురువుకు తొత్తుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. మమ్మల్ని తిడితే పడతాం కానీ.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తిడితే మేం పడతాం.. కానీ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని తెలిపారు. గతంలో కృష్ణా, ఇప్పుడు గోదావరి నది నీటి విషయంలో తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. గోదావరికి పూర్తిగా నీటిని మళ్లించి తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కుట్రలను ప్రశ్నించకుండా కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉంటున్నారని అన్నారు.
బనకచర్ల విషయంలో ప్రశ్నించింది బీఆర్ఎస్నే అని స్పష్టం చేశారు. మిగులు జలాలు లేనప్పుడు ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించామని తెలిపారు. ఇప్పుడు గోదావరి-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు అని అంటున్నారని పేర్కొన్నారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లను ఏపీకి మళ్లించాలని చూస్తున్నారని అన్నారు. పోలవరం నుంచి మళ్లిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మా నీళ్లు మాకు ఇవ్వడానికి కొత్త డ్రామాలా అని మండిపడ్డారు.
రాష్ట్ర నీటిహక్కులపై రేవంత్ ప్రభుత్వానికి సోయి లేదని హరీశ్రావు విమర్శించారు. చేతగాని ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ప్రాజెక్టుకైనా క్లియరెన్స్ తెచ్చారా అని ప్రశ్నించారు. 139 టీఎంసీలకు అనుమతులు వస్తాయా అని నిలదీశారు. పోలవరం-కావేరి లింక్ అయ్యాక.. గోదావరి మీద తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఫస్ట్ 968 టీఎంసీలకు అనుమతులు ఇచ్చాకే ఇంటర్ లింక్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ లింక్ చేసిన నీళ్లలో సగం తెలంగాణకు ఇవ్వాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. 139 టీఎంసీలకు గోదావరిలో సీడబ్ల్యూసీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గోదావరిలో 213 టీసీఎంసీలు నీళ్లు మనకు బొక్కపడతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు అనుమతి జరిగితే గోదావరిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోరు..కానీ ఏపీ ప్రయోజనాలు పట్టించుకుంటారా అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.