Rakul Preet Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా వెల్లడించింది. జిమ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వర్కవుట్ చేయడం వల్లే తాను పెద్ద ప్రమాదంలో పడ్డానని ఆమె తెలిపారు. ఇటీవల నేహా ధూపియా, అంగద్ బేడీలు నిర్వహిస్తున్న ‘డబుల్ డేట్’ టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్, ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిమ్లో శిక్షణ పొందుతున్న సమయంలో ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్లిఫ్ట్ను ఎత్తడానికి ప్రయత్నించానని, ఆ చిన్న పొరపాటు వల్ల తనకు తీవ్రమైన స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని చెప్పారు. ఆ గాయం కారణంగా తాను ఏకంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రైనర్లు ఏం చెప్పినా సరే, డెడ్లిఫ్ట్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామమని, అది కేవలం ఒక ఇగో లిఫ్ట్ మాత్రమేనని రకుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రమాదం వల్ల కనీసం కదలలేని స్థితికి చేరుకున్నానని, నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. ఎప్పుడూ ఎంతో చురుకుగా ఉండే తాను, కనీసం రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి రావడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ గాయం తనను శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎంతో కృంగదీసిందని రకుల్ కన్నీరు పెట్టారు. అయితే, ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భర్త జాకీ భగ్నానీ తనకు కొండంత అండగా నిలిచి ఎంతో ధైర్యాన్ని అందించారని ఆమె కొనియాడారు. 2024 ఫిబ్రవరిలో గోవా వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట, తమ వైవాహిక బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా ఈ షోలో పంచుకున్నారు. ప్రస్తుతం రకుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.