Telangana | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు జీవనాధారమైన చెరువుల బలోపేతానికి ఉద్యమనేత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘మిషన్ భగీరథ’ చేసిన అద్భుతాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఇప్పటికే ఎన్నో సంస్థలు కితాబునివ్వగా, తాజాగా తమిళనాడు జియోగ్రఫీ నిపుణులు కూడా కొనియాడారు. ‘చెరువుల పునరుద్ధరణలో తెలంగాణే భేష్’ అని చాటిచెప్పారు. దేశంలో అత్యధిక చెరువులు కలిగిన రాష్ట్రంగా తెలంగాణే నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో నీటి వనరుల పరిస్థితి ఏమిటి? ఏ రాష్ట్రంలో నీటి వనరులు ఎక్కువ ఉన్నాయి? తదితర అంశాలపై కేంద్ర జల్శక్తి శాఖ అధ్యయనం చేసి నిరుడు నివేదిక విడుదల చేసింది. ఇందులోని గణాంకాలను ఆధారంగా చేసుకొని దేశంలోనే అత్యధిక నీటి వనరులున్న రాష్ట్రం తమిళనాడు అని పేర్కొంటూ ద్రవిడియన్ ఇన్సైట్స్ సంస్థ ఎక్స్ వేదికగా నిరుడు ప్రకటించింది. తాజాగా ఈ ప్రకటనను తమిళనాడు జియోగ్రఫీ నిపుణులు ఖండించారు. దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని, ఎందుకంటే ఆ రాష్ట్రం చెరువులను ట్యాంక్లుగా వర్గీకరించిందని, తమిళనాడు లేక్స్గా పిలుస్తున్నదని వివరించారు. నీటి వనరుల పునరుద్ధరణ కోసం తమిళనాడు 50 ఏండ్లలో చేసిన ఖర్చును తెలంగాణ కేవలం పదేండ్లలోనే చేసి అనేక చెరువులను బాగుచేసిందని కొనియాడారు.
అపరభగీరథుడి అద్భుత కృషి ఫలితం
ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల కుట్రలతో తెలంగాణ ప్రాంతానికి జీవనాడి అయిన గొలుసుకట్టు చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరి, కట్టలు కరిగి, నిల్వ నీరు లేకుండా బోసిపోయాయి. తెలంగాణ పల్లె బతుకు ఛిద్రమై పల్లె జీవనం పట్నాలకు వలస కట్టింది. ‘మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల’కే పెద్దపీట వేసి తెలంగాణలో ఉన్న చెరువులను ‘మైనర్ ఇరిగేషన్’ కింద చూపుతూ ఈ ప్రాంతానికి ఆయువుపట్టులాంటి తటాకాలను వట్టిపోయేలా చేసిన కుట్రలను గుర్తించిన కేసీఆర్, చెరువుల పునరుద్ధరణ అంశాన్నే ఉద్యమ నినాదంగా చేసుకున్నారు. తెలంగాణ ప్రాంత చెరువులు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయో అనేకసార్లు ప్రజలకు వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి ప్రాధాన్యతగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులున్నట్లు లెక్క తేల్చారు. వీటికింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించి ఏటా 20శాతం పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద కేసీఆర్ స్వయంగా ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టారు. నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. ఐదో దశలోనూ మిగిలిన చెరువుల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. చెరువులకు శాశ్వత జలకళను తెచ్చేందుకు ప్రాజెక్టులతో అనుసంధానించారు. మొత్తంగా ప్రాజెక్టు కమాండ్ ఏరియాలోని 20 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యం పెట్టుకొని 10వేల చెరువులకు పైగా అనుసంధానం చేసి నదీజలాలతో నింపారు. పదేండులగా మిషన్ కాకతీయ పథకం ఫలితాలు కండ్లెదుట కనిపిస్తున్నాయి. ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. మత్స్య పరిశ్రమ గణనీయ వృద్ధి సాధించింది. జీవాలు, పాడిపశువులకు నీటి కొరత తీరిపోయింది. పూడిక మట్టిని పొలాలకు తరలించడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు నిగ్గుతేల్చాయి. నీటి వనరుల వృద్ధితో తెలంగాణ క్రమంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. పల్లెలు పచ్చదనాన్ని పులుముకున్నాయి. ఏటికేడు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా పెరుగుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే మిషన్ కాకతీయ పథకం పల్లెకు జీవం పోసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమిచ్చింది. పథకం ఫలితాలపై యావత్ దేశమే ప్రశంసలు కురిపించింది. అనేక రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయి.
పెరిగిన భూగర్భ జలమట్టం
(భూగర్భ జలాల వృద్ధిలో 89.5శాతంతో దేశంలోనే తెలంగాణ టాప్గా నిలచింది)
మీటర్లు (భూమినుంచి లోతులో)