హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని విస్మరించడంతో అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హోమ్ శాఖలో 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. కనీసం 20వేల పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇస్తారని ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త తెలియడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. 20 వేల పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బంద్కు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగ విరమణలు, కొత్త స్టేషన్ల ఏర్పాటు, మహిళా పోలీసుల సంఖ్య పెంపు, పెరుగుతున్న జనాభా, చట్టవ్యవస్థ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బంద్కు సన్నాహాలు..
హోమ్శాఖ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను 20వేలకు పెంచాలనే డిమాండ్తో నిరుద్యోగ సంఘాలు, అభ్యర్థులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెలలోనే ‘తెలంగాణ బంద్’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అన్ని నిరుద్యోగ సంఘాలను ఒకతాటిపైకి తెచ్చి.. ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నాలుగు కమిషనరేట్ల పరిధిలో.. పోలీసు ఉద్యోగాలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. బంద్ విజయవంతంపై అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నారు. బంద్కు ముందు సన్నాహక సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణలు, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిరసన ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, మానవహారాలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.
అన్ని పార్టీల నేతలకూ వినతులు
బంద్కు సహకరించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనేతలకు వినతులు ఇచ్చేందుకు నిరుద్యోగులు సిద్ధపడుతున్నారు. తమ కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతోపాటు.. అన్ని రాజకీయ వర్గాలు, ప్రొఫెసర్లకు కూడా వినతులు ఇవ్వనున్నారు. ఆయా సామాజిక వర్గాల ప్రముఖ నేతలను కూడా కలువనున్నారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ, మహిళా, తెలుగు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల సపోర్ట్ తీసుకొని.. రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించాలని దృఢంగా సంకల్పించారు. ఈ మేరకు నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల సపోర్టు కూడా తీసుకొని బంద్ను విజయవంతం చేస్తామని చెప్తున్నారు.