Ola | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ): తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడోలను నిషేధించి ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలని మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శనివారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ను కలిసి వినతిపత్రం అందించారు.
ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తూ కస్టమర్లతో ఘర్షణలకు పాల్పడుతున్న ఆన్లైన్ వాహన సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో, మోటార్ రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇంధన ధరలను పెంచి డ్రైవర్లతో చెలగాటమాడుతుండటాన్ని నిరసిస్తూ అక్టోబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఏబీడీయూ, టీడీఎఫ్, క్యాబ్ సంఘాల జేఏసీ, లారీ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.