హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టి 13 కోట్ల పనిదినాలను కల్పించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 9 లక్షల 80 వేల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. హైద్రాబాద్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం పంచాయతీరాజ్ కార్యదర్శి సంధీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునంధన్రావులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా అదనపు కలెకర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెప్రగతి, వివిధ పథకాల అమలును సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కష్టకాలంలో కరోనా విస్తరించి ఉన్నా ఎంతో కష్టపడి ఉపాధిహామీ పథకం కొనసాగిస్తూ ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్న అధికారులను, ఉద్యోగులను మంత్రి అభినంధించారు. కరోనా వ్యాప్తి వల్ల నగరాలు, పట్టణాల నుండి చాలామంది తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని, వారందరికి అవసరమైన జాబ్కార్డులు అందించి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన పంట కాలువలు, ఫీల్డ్ చానల్స్ల పూడికతీత, వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న జ్వర సర్వేల్లో ఏయన్యం, ఆశా కార్యకర్తలతో పాటుగా పంచాయతీ సెక్రటరీలు చురుగ్గా పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 వేల 766 చెత్తను వేరుచేసే షెడ్లు మంజూరు కాగా, ఇప్పటికే 12వేల 602 షెడ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆందులో11,566 చెత్తను వేరుచేసే షెడ్లు వినియోగంలోకి వచ్చాయని, మిగతా షెడ్లు వినియోగంలోకి వెంటనే తీసుకురావాలని ఆయన డిఆర్డివోలను కోరారు. రాష్ట్రంలోని గ్రామాలలో 12 వేల 756 వైకుంఠధామాలు(స్మశాన వాటికలు) మంజూరు కాగా, అందులో 11 వేల 515 పూర్తి అయ్యాయని, 9 వేల 140 వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న మిగతా వైకుంఠధామాల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి కోరారు. హరితహరం కార్యక్రమంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటడానికి కావాల్సిన మొక్కలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.