Gaddar | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు, అందరికి ఆప్తుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణానికి శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పాటకు ప్రపంచ వ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్గా ప్రసిద్ధి పొందిన గుమ్మడి విఠల్ మరణించడం యావత్ తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన ఆయన విప్లవోద్యమాల్లో కీలక పాత్ర పోషించి, ఎన్నో పాటలతో ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన గద్దర్ లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. తమలో గద్దర్ ఉత్సాహాన్ని నింపారని, అద్భుతమైన కళాకారుడని, ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గద్దర్ మృతికి రాష్ట్ర శాసనసభ, ప్రభుత్వం తరఫున నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నామని, శోకార్తులైన వారి కుటుంబానికి, ఆయన అభిమానులకు, మిత్రులకు మనోధైర్యాన్ని, ఆత్మైస్థెర్యాన్ని దేవుడు కల్పించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.