CEC Rajiv Kumar | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచి ఓటువేసేందుకు అర్హులని తెలిపారు. ఇంటినుంచి ఓటు వేయాలనుకొనేవారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల్లో ఫారం-12డీ ద్వారా ఎన్నికల రిటర్నింగ్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విధానాన్ని మొదటిసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అమలుచేసింది. అసెంబ్లీ ఎన్నికలపై అధికార యంత్రాంతం సన్నద్ధతను పరిశీలించేందుకు రాష్ట్రంలో మూడురోజుల పర్యటన జరుపుతున్న ఈసీ బృందం చివరిరోజు గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. సీఈసీ రాజీవ్కుమార్, ఈసీలు అనూప్చంద్ర పాండే, అరుణ్గోయల్ తెలంగాణ సీఈవో వికాస్రాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో 7,689 మంది 100 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్లున్నారని తెలిపారు. 80 ఏండ్లకు పైబడినవారు 4.43 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు, పురుషులు కూడా 1.58 కోట్ల చొప్పున ఉండటం సంతోషకరమని సీఈసీ పేర్కొన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 998 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, ఇది మహిళా శక్తికి నిదర్శనమని అన్నారు. 2018లో ఓటర్ లింగనిష్పత్తి 982 ఉండగా.. 2019కి 990కి, 2023 నాటికి 998కి పెరిగిందని వెల్లడించారు.
2018 ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్ నమొదైతే, హైదరాబాద్తోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 29 నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటుకంటే తక్కువ పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. ఈ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగు పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా చెంచు, కోలం, తోటి, కొండరెడ్డి గిరిజనులను గుర్తించామని చెప్పారు. వీరిలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించినట్టు తెలిపారు. ఈ నాలుగు వర్గాల జనాభా 59,583 ఉండగా, వీరిలో 18 ఏండ్లు పైబడినవారు 39,186 మంది ఉన్నారని పేర్కొన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 1,952.. 2,556కు పెరిగిందని తెలిపారు.
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు. ఎక్కడ కోడ్ ఉల్లంఘన జరిగినా ఫొటో/వీడియో తీసి యాప్లో అప్లోడ్ చేసి ఘటన వివరాలు తెలిపితే 100 నిమిషాల్లో (1గంట 40 నిమిషాలు) జీఐఎస్ లోకేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ స్పందస్తుందని చెప్పారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యాప్తోపాటు ఓటర్ హెల్ప్లైన్, సువిధ పోర్టల్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను ‘నో యువర్ క్యాండిడేట్’ యాప్లో తెలుసుకోవచ్చని అన్నారు. అభ్యర్థుల నేర చరిత్రపై పార్టీలు, అభ్యర్థి కూడా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు అని రాజీవ్కుమార్ అన్నారు. ఈ రాష్ట్రం మినీ ఇండియాగా ఉంటుందని, దేశంలోని అన్నిప్రాంతాలవారు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మూడురోజుల పర్యటనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి, వారి విజ్ఞప్తులు స్వీకరించామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు, బహుమతులు అందించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. యూపీఐ, ఆన్లైన్లో చెల్లింపుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంచేవారిని గుర్తించేందుకు స్టేల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) ద్వారా ఆర్బీఐ దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఒక అకౌంట్ నుంచి అనేక మందికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేవాటిపై దృష్టి పెడుతామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి, వాటన్నంటికి సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన్నట్టు వెల్లడించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలోనూ మొదటిసారి చెక్ పోస్టులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 2022, 2023 సంవత్సరాల్లో 22 లక్షల ఓటర్లను తొలగించినట్టు సీఈసీ రాజీవ్కుమార్ తెలిపారు. 2022లో 14 లక్షల మంది, 2023లో 7.90 లక్షల మంది చనిపోయిన, డూప్లికేట్, తప్పుడు చిరునామా ఉన్న ఓట్లను తొలగించిన్నట్టు చెప్పారు. 2023లో 14 లక్షల ఓటర్లకు సంబంధించి జాబితాలో సవరణలు చేశామని వెల్లడించారు. 2014 నుంచి ఓటరు జాబితాతో పోల్చుకుంటే 1.66 శాతం వార్షిక వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. 2023 జనవరితో పోల్చితే 5.8 శాతం వృద్ధి ఉన్నదని వివరించారు. 7.66 లక్షల ఇండ్లల్లో 75.97 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించామని, వీటిలో 4.15 లక్షల మంది ఓటర్ల చిరునామాలను మార్చినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 18, 19 ఏండ్ల వయసున్న 8.11 లక్షల మంది ఈసారి కొత్తగా ఓటు హక్కుల పొందారని వివరించారు. యువతులు 3.45 లక్షల మంది ఉన్నట్టు చెప్పారు. ఇందులో లింగ నిష్పత్తి 707 నుంచి 743కు పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు.