BJP | హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. ఇతర ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని కొందరు అనుకుంటున్నారని, అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు.